రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించాలని నిజామాబాద్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించామని సీఈవో రజత్కుమార్ తెలిపారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని 34 వేల 604 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అందులో 4 వేల 169 పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఇక సి-విజిల్ ద్వారా 1430 ఫిర్యాదులు అందాయని ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలపై కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినట్టు రజత్ కుమార్ వెల్లడించారు.
అలాగే అత్యధికంగా 180మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలియజేశారు. 12 రకాల గుర్తింపు కార్డులు చూపించి ఓటేయ్యొచ్చన్న ఆయన పోలింగ్ స్టేషన్లలో సెల్ఫీలు దిగితే చర్యలు తప్పవని రజత్కుమార్ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం రూ.52కోట్ల 62లక్షలకు పైగా నగదు పట్టుబడిందని తెలియజేశారు. పోలింగ్ రోజు అన్ని ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు తప్పవని రజత్కుమార్ హెచ్చరించారు.