చంద్రయాన్ - 2 కు ముహూర్తం నిర్ణయించేశారు. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని జూలై నెల 15 వ తేదీన జరపనున్నట్టు ఇస్రో చైర్మన్ కె. శివన్ వెల్లడించారు. జులై 15వ తేదీ తెల్లవారుజామున 2.51గంటలకు జీఎస్ఎల్వీ మార్క్(ఎంకే)-3 రాకెట్ సాయంతో ఈ మిషన్ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, ల్యాండర్లను జాబిలిపైకి పంపనున్నట్లు తెలిపారు.
ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ సాయంతో శ్రీహరికోట నుంచి నింగిలోకి చేరుకొంటుంది. అక్కడి నుంచి ఆర్బిటర్ ప్రొపెలైజేషన్ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిలివైపు దూసుకెళుతుంది. ఆర్బిటర్ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. మరోపక్క ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుంది. అనంతరం దానిలోంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు ప్రారంభిస్తుంది. ఈ రోవర్ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా ల్యాండర్పై భాగంలో అమర్చారు. సెప్టెంబర్ నుంచి ఇది సంకేతాలను ఇస్రోకు పంపనుంది.
వెయ్యి కోట్ల ఖర్చు ఈ ప్రాజెక్టుకు అవుతోంది. అత్యంత శక్తివంతమైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరపబోతున్నారు. దీనిలోని అర్బితార్, ల్యందర్ కు విక్రం, రోవర్ కు ప్రజ్ఞ అని పేరు పెట్టారు. చంద్రయాన్-2 మొత్తం బరువు 3.8 టన్నులు. చంద్రయాన్లో మన ల్యాండర్, రోవర్ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 రకాల పరికరాలను చంద్రుడిపైకి పంపిస్తున్నారు. వీటిసాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అన్వేషిస్తారు. నాసా సమకూర్చిన లేజర్ ర్యాంగింగ్ను ఉచితంగా చంద్రుడిపైకి తీసుకెళుతున్నారు.