జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ట్రాప్ లో చిక్కుకుని నాటకాలాడుతున్నారని ఎమ్మెల్సీ, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వైఎస్ జగన్ గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ.. భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ జగన్ను ప్రశ్నించడం పవన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. భీమవరంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పవన్ ఒక్కసారి కూడా తుందుర్రు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి బీజం వేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నాని అన్నారు. జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానన్న నాని.. దమ్ముంటే పవన్ గానీ, జనసేన నాయకులు గానీ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.