constable and his two months old son died in road accident

Update: 2017-09-10 15:39 GMT

హైదరాబాద్‌ః నగర పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని రెండు నెలల కొడుకు కూడా మరణించాడు. కానిస్టేబుల్ భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్-బిజాపూర్ హైవేపై జరిగింది. శంకరపురం శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ.. భార్య, రెండు నెలల బాబుతో కలిసి కూకట్‌పల్లిలో నివాసముండేవాడు. గత అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలోని స్వగ్రామానికి  వెళ్లి.. స్నేహితుడి కారులో తిరిగొస్తున్నాడు. హైవేపై వస్తుండగా మల్కాపూర్ గేట్ సమీపంలో కారు టైర్ పంక్చరైంది. దీంతో వాహనాన్ని అదుపుచేయలేక.. ఎదురుగా ఉన్న ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌తో పాటు రెండు నెలల బాబు కూడా ఘటనా స్థలిలోనే చనిపోయాడు. శ్రీనివాస్ భార్యను అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.