ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు. సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్ కుమార్, మేనకోడలు అంజలితో కలిసి సర్వమత ప్రార్థనల చేశారు. అనంతరం 8.19 గంటలకు వైఎస్ జగన్, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు.
అనంతరం వైఎస్ జగన్ పార్టీ నేతల సమక్షంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు.