టీడీపీకి ఆ ఎమ్మెల్యే ఝలక్ ఇస్తారా?

Update: 2019-02-24 04:16 GMT

ఎన్నికల వేళ ఏపీలో జంపింగ్ లు ఊపందుకున్నాయి. రాయలసీమలో సీట్లు కన్ఫామ్ చేసే పనిలో పడ్డ చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చేలా ఉన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఏవీ లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈసారి తంబళ్లపల్లి టికెట్ ను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

దీంతో టీడీపీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాలుగున్నారేళ్లుగా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు బెంగళూరులో సొంతపనులు చక్కదిద్దుకోవడంలోనే ఎక్కువ సమయం కేటాయించేవారని ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శంకర్ యాదవ్ కు చంద్రబాబు టికెట్ నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఆదివారం చంద్రబాబును కలవనున్నారు శంకర్ యాదవ్.. టికెట్ పై హామీ ఇవ్వకపోతే ఆయన వైసీపీలో చేరే అవకాశమున్నట్టు సమాచారం. 

Similar News