నేను ఓడిపోయానని అనుకోవడంలేదు. నాకు వచ్చిన ప్రతి ఓటు వంద కోట్ల రూపాయలకు సమానం. జనసేన పార్టీ సీట్లు గెలవకపోయినా, స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజల మనసులు గెలుచుకుంది. సమస్యల పరిష్కారం కోసం జనసేన ఉంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో ఏకీభవించే ప్రసక్తేలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే గౌరవం ఉంది కానీ భయం మాత్రం లేదు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితిపై ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న అయన ఈరోజు రాయలసీమ ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒకింత ఆవేశంగా మాట్లాడారు.
కాగా, పార్టీ నేతలతో ముచ్చటిస్తూ కూడా పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపించారు. ఒక్క వీరవాసరం మండలంలోనే రూ.30 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసిందని అన్నారు. ఇప్పటివరకు తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయాలు కూడా చూస్తారని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు. దెబ్బకు దెబ్బ తీస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో హల్ చల్ చేస్తోంది.