ఏపీ సీఎం చంద్రబాబు మోడీ, జగన్, కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖ జిల్లాలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. జగన్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు పంపించారని, అవే డబ్బులను ఎన్నికల్లో పంచేందుకు ఇస్తారని ఆరోపించారు. జగన్ వెంట నడుస్తున్న యువత ఆలోచించాలని... కేసుల్లో ఇరుకున్న జగన్ వెంట తిరిగి ఇబ్బంది పడొద్దని అన్నారు. ఏపీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమని చోడవరంలో చేసిన ప్రచారంలో చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కోసం యంత్రంలా పనిచేశానని.. ఐదేళ్లు నిద్రపోలేదని అన్నారాయన.
అన్ని వర్గాలకు తాను ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రధాని మోడీ.. జగన్కు రక్షణ కవచంలా మారారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసే వ్యక్తులకు ఓటు వేస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. 'కేసీఆర్, జగన్, మోదీ ముగ్గురూ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు. కానీ... మాతో పెట్టుకుంటే వదిలేది లేదు' అని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఉన్మాదులు పెరిగిపోతారని, రౌడీయిజం పెరిగిపోతుందని హెచ్చరించారు.