Telangana: స్టేట్‌ ఫుడ్ ప్రాసెసింగ్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం

TS Cabinet Approves Telangana State Food Processing Policy
x

సీఎం కేసీఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: రాష్ట్రమంతటా ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం

Telangana: సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న ప్రగ‌తి భ‌వ‌న్‌లో వ‌రుస‌గా రెండోరోజు స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్‌.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించి కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలని రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుతో పాతికవేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని... 70 వేల మందికి ప్రత్యక్షంగా, మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ధాన్యం, పంటల దిగుబడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో... ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రంగంలో సుమారు పాతిక వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష, మూడు లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, 500 ఎకరాలకు తగ్గకుండా వెయ్యి ఎకరాల వరకు 2024 -2025 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఎకరాల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఈ విధానంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు భూమి కేటాయించాలని నిర్ణయించారు. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ప్లగ్ అండ్ పే పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలుకు అధికారులను అదేశించారు. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించారు.

ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్థుతం జూలై 12 వరకు ఉన్న ఆఖరు తేదీని జులై 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పాలసీ లో రూపొందించిన మార్గదర్శకాలపై కేబినెట్ చర్చించింది. రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి మరియు మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని కేబినెట్ నిర్ధారించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories