Mydukur: మైదుకూరులో రాయలసీమ హక్కుల పోరాట నినాదం
Mydukur: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ప్రాంతీయ హక్కుల సాధన కోసం మే 31న నంద్యాలలో భారీ రైతు మహాసభ నిర్వహించనున్నారు.
Mydukur: మైదుకూరులో రాయలసీమ హక్కుల పోరాట నినాదం
మైదుకూరు: రాయలసీమ హక్కుల సాధన, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ఈనెల 31వ తేదీన నంద్యాల పట్టణంలోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో ‘రాయలసీమ సాగునీటి సమితి’ ఆధ్వర్యంలో భారీ రైతు మహాసభ నిర్వహించనున్నారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మైదుకూరు పట్టణంలో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో గోడపత్రిక (కరపత్రం) విడుదల చేశారు.
ఈ సందర్భంగా రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై, భవిష్యత్తు పోరాట కార్యాచరణపై చర్చించేందుకు ఈ మహాసభ వేదిక కానుందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, కర్నూల్లో హైకోర్టు బెంచ్, కడప ఉక్కు కర్మాగారం, అనంతపురంలో ఎయిమ్స్ (AIIMS) ఏర్పాటు, సీడ్స్ అండ్ హార్టికల్చర్ హబ్ల స్థాపన వంటివన్నీ ఇప్పటికీ కేవలం హామీలుగానే మిగిలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రాయలసీమ జీవనాడి అయిన సిద్దేశ్వరం అలుగు సాగునీటి ప్రాజెక్టుతో పాటు, దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న అన్ని ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హక్కుల సాధన కోసం జరిగే మహాసభలో కడప జిల్లాలోని రైతులు, ప్రజలు, యువకులు రాజకీయాలకతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కరపత్ర విడుదల కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు మండల కార్యదర్శి తిరువాయిపాటి నరసింహులు, రైతు నాయకులు పెద్దకొండయ్యగారి సుబ్బరాయుడు, మూలే సుబ్బారెడ్డి, రాజాల ఎల్లయ్య, దాశరెడ్డిగారి సుబ్బరాయుడు, ప్రజా సంఘాల నాయకులు మిద్దె వెంకటరమణ, నాగార్జున, విలియమ్స్, పసల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




