Karimnagar: ధరల పెంపుపై సీపీఐ సమరశంఖం.. 10న కలెక్టరేట్ వద్ద భారీ నిరసన!
Karimnagar: వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కరీంనగర్లో సీపీఐ నిరసన.
Karimnagar: ధరల పెంపుపై సీపీఐ సమరశంఖం.. 10న కలెక్టరేట్ వద్ద భారీ నిరసన!
కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపడానికి పదేపదే వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నామని,దీన్ని విజయవంతం చేయుటకు సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు.
పెట్రోల్, డీజిల్ ధరలు,గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజల జీవనప్రమాణలపై ఆ ప్రభావం పడుతుందని, పేదల ఆర్థిక స్థితి గతులు చిన్నా భిన్నం అవుతున్నాయని, సిలిండర్ల పై వంటచేసుకునే పరిస్థితి లేకుండా పోతుందని, చిన్న చిన్న ఉద్యగాలు, ప్రైవేట్ రంగాల్లో తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకునే వారు కనీసం వారివారి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకోవడానికే భయపడుతున్నారని అన్నారు.
దేశంలో గ్యాస్ పెట్రోలు డీజిల్ కు ఎలాంటి కొరత ఏర్పడదని ప్రగల్భాలు పలికిన బిజెపి పాలకులు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెంచి సామాన్యులపై పెను భారం మోపే విధంగా ధరలు విపరీతంగా పెంచిందని ఈ నేపధ్యంలో 10వ తేదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.




