హైకోర్టు చెంతకు ఆర్టీసీ లెక్కలు

హైకోర్టు చెంతకు ఆర్టీసీ లెక్కలు
x
Highlights

ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. 2019 ఆగస్ట్ నాటికి ఆర్టీసీ 5వేల 269కోట్ల నష్టాల్లో ఉందన్న ప్రభుత్వం...

ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. 2019 ఆగస్ట్ నాటికి ఆర్టీసీ 5వేల 269కోట్ల నష్టాల్లో ఉందన్న ప్రభుత్వం వివిధ వర్గాలకు 2వేల 209కోట్ల రూపాయలు బకాయి పడిందని లెక్కలతో సహా వివరించింది. ఇక, పండగలు, ముఖ్య సమయాల్లో సమ్మెకు దిగడం యూనియన్లకు అలవాటుగా మారిందన్న ప్రభుత్వం పారిశ్రామిక వివాద చట్టానికి అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది.

ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక వ్యాఖ‌‍్యలు చేసింది. ఇంకెంత కాలం ఆర్టీసీని ఆదుకోవాలంటూ హైకోర్టును కోరింది. ఆర్టీసీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వివిధ వర్గాలకు 2వేల 209కోట్ల రూపాయలు బకాయి పడిందని లెక్కలతో సహా నివేదిక ఇచ్చింది. పీఎఫ్ బకాయిలు 788కోట్లు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బకాయిలు 500కోట్లు, లీవ్ ఎన్-క్యాష్-మెంట్ బకాయిలు 180కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్మెంట్ల బకాయిలు 52కోట్లు ఉన్నాయని తెలిపింది. ఇక, మోటారు వెహికల్ యాక్టు కింద 452కోట్లు, హెచ్ఎస్‌డీ ఆయిల్ బిల్స్ 34కోట్లు, హెచ్‌వో రీజియన్, జోన్ బకాయిలన్నీ కలిపి 36కోట్లు ఉన్నాయని లెక్క చూపింది. అలాగే, అద్దె బస్సులకు 25కోట్ల ఇవ్వాల్సి ఉందని నివేదికలో వివరించింది. అసలు సంస్థ ఉద్యోగులకే ఆర్టీసీ యాజయాన్యం 15వందల 21కోట్ల రూపాయిల బకాయి పడిందని లెక్కలు చెప్పింది. ఇక, కాలం చెల్లిన 2వేల 609 బస్సులను మార్చాలంటే 750కోట్లు అవసరమని ప్రభుత్వం తెలిపింది. వచ్చే మార్చి నాటికి మరో 476 బస్సులు కాలం చెల్లుతాయని, అలాగే ఆర్టీసీ బస్సుల మరమ్మతు బకాయిలు 60లక్షలు ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలియచేసింది.

ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి అంతా యూనియన్లకు తెలుసంటోన్న ప్రభుత్వం 2019 ఆగస్ట్ నాటికి ఆర్టీసీ 5వేల 269కోట్ల నష్టాల ఉందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీకి 47కోట్లు ఇవ్వాలన్న కోర్టు సూచనను సానుకూలంగా పరిశీలించామని, అయితే కేవలం 47కోట్లతో సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదని, అయినా ఆర్టీసీని ఇంకా ఎన్నిసార్లు, ఎంతకాలం ఆదుకోవాలని అఫిడవిట్‌ ద్వారా హైకోర్టుకు నివేదించింది ప్రభుత్వం. అయితే, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అంటున్నారు. రీఎంబర్స్‌‌మెంట్ ద్వారా ఆర్టీసీకి 2వేల 2వందల కోట్లకుపైగా రావాల్సి ఉందంటున్నారు.

ఇక, ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్‌బండ్‌‌ వివాదంపైనా ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్య తీర్పుపై దేశమంతటా హైఅలర్ట్ ఉండగా, ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ నిర్వహించారని, దాంతో భద్రతా బలగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని హైకోర్టుకు నివేదించింది. అయినా పండగలు, ముఖ్య సమయాల్లో సమ్మెకు దిగడం యూనియన్లకు అలవాటుగా మారిందన్న ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె వెనుక ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపణలు చేసింది. అందువల్ల, పారిశ్రామిక వివాద చట్టానికి అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది తెలంగాణ ప్రభుత్వం. మరి, సర్కారు నివేదికపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories