వలస కార్మికుల తరలింపునకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వలస కార్మికుల తరలింపునకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు రోజుకు 40...

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశం పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండటంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మాట్లాడి, ఇవాళ్టి నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది.

తమ సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories