పాక్ కు క్రికెట్ షాక్?

పాక్ కు క్రికెట్ షాక్?
x
Highlights

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో క్రికెట్ బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు పాకిస్థాన్ తో ప్రపంచకప్...

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో క్రికెట్ బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు పాకిస్థాన్ తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడకుంటే భారత్ కే నష్టమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అంటున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం భారత ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకొంటే ఆ నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని ప్రకటించాడు.

పుల్వామా ఉగ్రదాడికి కారణమైన పాకిస్థాన్ పై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్ తో క్రీడాసంబంధాలు వద్దేవద్దని అంటున్నారు, ఇప్పటికే మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం, జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలోని పాక్ క్రికెటర్ల చిత్రాలను ఆయా క్రికెట్ సంఘాలు తొలిగించడం ద్వారా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాదు దేశంలోని అత్యంత పురాతన క్రికెట్ క్లబ్ సీసీఐ సైతం పాకిస్థాన్ తో వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. దేశంకంటే క్రీడలు ఏమంతగొప్పవి కావంటూ సీసీఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

దీనికితోడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ హర్భజన్ సింగ్ సైతం పాకిస్థాన్ తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడకపోయినా ఫైనల్ చేరి ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని గుర్తు చేశాడు. భారత్ సహనానికి పదేపదే పరీక్షపెడుతున్న పాక్ దుశ్చర్యలను ఇక సహించరాదంటూ హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిగా జరిగే ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భాగంగా జూన్ 16న మాంచెస్టర్ లో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ తో టీమిండియా తలపడాల్సి ఉంది. ఈమ్యాచ్ ను భారత్ బహిష్కరించినా మిగిలిన మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా ఫైనల్స్ చేరే అవకాశం ఉందని హర్భజన్ గుర్తు చేశాడు.

ఇదిలాఉంటే ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్థాన్ తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ఐపీఎల్ బోర్డు చైర్మన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఏదిఏమైనా పుల్వామా ఉగ్రదాడి కారణంగా ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న భారత్, పాక్ క్రికెట్ సంబంధాలు బాగుచేయటానికి వీలులేనంతగా పతనమయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories