టీఆర్ఎస్లో స్థానిక ఎన్నికల సందడి...జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ముందే చైర్మన్ అభ్యర్థుల ప్రకటన
టీఆర్ఎస్లో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించడంతో మిగతా మాజీలు కూడా జెడ్పీ చైర్మన్...
టీఆర్ఎస్లో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించడంతో మిగతా మాజీలు కూడా జెడ్పీ చైర్మన్ టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లతో తమకు ఛాన్స్ మిస్సయినా తమ కుటుంబ సభ్యులు, బంధువులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. సగానికి పైగా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ అభ్యర్థులుగా వారసులే పోటీపడుతుండటం హాట్ టాపిక్గా మారింది.
టీఆర్ఎస్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ముందే చైర్మన్ అభ్యర్థుల ప్రకటన మొదలు కావడంతో ఆశావహులు హడావుడి చేస్తున్నారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక సభ్యుల అభిప్రాయం మేరకు, లేదా ఓటింగ్ ద్వారా జెడ్పీ చైర్మన్ను నియమించే వారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా జెడ్పీ చైర్మన్ ఎంపిక జరుగుతోంది. దీంతో ఆశావహులు నేరుగా చైర్మన్ సీటుపైనే కన్నేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జెడ్పీ స్థానాలకు గాను సగానికి పైగా జిల్లాలకు వారసులే పోటీపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోవా లక్ష్మి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధు పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో మిగతా స్థానాల్లో ఆశావహులంతా తెరపైకి వచ్చారు.
నిజామాబాద్ జెడ్పీ స్థానం జనరల్ కేటగిరికి ఇవ్వడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కరీంనగర్ జెడ్పీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తన భార్యకు టిక్కెట్టు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
భువనగిరి జెడ్పీ చైర్మన్ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి తమ కుమారుడి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయగా వరంగల్ రూరల్ జెడ్పీ టిక్కెట్టు కోసం ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి భార్యలకు గానీ, ప్రధాన అనుచరులకు గానీ ఇప్పించేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. అలాగే, నాగర్ కర్నూలు ఎస్సీ జనరల్ కావడంతో తన కుమారుడి కోసం మందా జగన్నాథం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఖమ్మం ఎస్సీ జనరల్కు కేటాయించడంతో పిడమర్తి రవి, మహబూబాబాద్ స్థానం కోసం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తన కోడలికి ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జెడ్పీ కోసం మంత్రి మల్లారెడ్డి కూడా కోడలి కోసం ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. ఇక వికరాబాద్ జెడ్పీ చైర్మన్ కోసం మాజీ మంత్రి మహేందర్రెడ్డి మరోసారి తన భార్యకే ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి టీఆర్ఎస్లో స్థానిక ఎన్నికల జాతర మొదలైంది. పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారే మళ్లీ స్థానిక పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో కిందస్థాయి నేతలంతా ఆందోళన చెందుతున్నారు. మరి టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire