ఆయన సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ తొడగొట్టి అలజడి సృష్టిస్తాడు. తిక్క రేగితే చెంప ఛెళ్లుమనిపిస్తాడు. మెంటల్ ఎక్కితే పరుగెత్తించి మరీ పంచ్లు...
ఆయన సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ తొడగొట్టి అలజడి సృష్టిస్తాడు. తిక్క రేగితే చెంప ఛెళ్లుమనిపిస్తాడు. మెంటల్ ఎక్కితే పరుగెత్తించి మరీ పంచ్లు విసురుతాడు. ప్రజాజీవితంలో ఇలాంటివి చేయకూడదని చెప్పినా, ఆయన నేనింతేనంటాడు. అలాంటి మనిషి, హిందూపురంలో మరోసారి పోటీకి సై అన్నాడు. పసుపుదండుకు కంచుకోట మరోసారి తమదేనంటున్నాడు. అటు నందమూరి కంచుకోటను బద్దలుకొడతాం, కొట్టేశామంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్. మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి, బాలయ్యను చక్రబంధనం చేశామంటోంది. మొన్నటి వరకూ బాలయ్య గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ అనుకున్నారు. కానీ పోలింగ్ సరళి చూసి, టఫ్ ఫైట్ తప్పదంటున్నారు. తెలుగుదేశానికి కంచుకోటయిన హిందూపురంలో, టఫ్ ఫైట్ అనే టాక్ ఎందుకొస్తోంది కారణాలేంటి?
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపరంలో పసుపు జెండాకు ఎదురేలేదు. స్వయానా ఎన్టీఆర్ అక్కడి నుంచి పోటీ చేయడంతో హిందూపురం కాస్త నందమూరిపురంగా మారింది. 2014 ఎన్నికల వరకూ అక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ, తాజాగా బాలకృష్ణ అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ప్రత్యర్థులు ఎవరైనా, రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. 1983 నుంచి 1999 వరకు ఐదంకెల భారీ మెజారిటీలు అందించిన ప్రజలు, 2004, 09 ఎన్నికల్లో మాత్రం కాస్త మెజారిటీ తగ్గించారు. మళ్లీ గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మాత్రం 16 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించారు. 2004 నుంచి నవీన్ నిశ్చల్ కాంగ్రెస్ తరపున, స్వతంత్రంగా, వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన్ను పక్కనపెట్టారు జగన్. హిందూపుర్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మైనారిటీల ఓటుబ్యాంకును కొల్లగొట్టడానికి మాజీ ఐజీ ఇక్బాల్ అహ్మద్ను బరిలోకి దించారు. వీరి మధ్య హిందూపురంలో నువ్వానేనా అన్నట్టుగా యుద్ధ సాగింది.
హిందూపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,29,262 మంది. అందులో పురుషులు 1,16,176 మంది, స్త్రీలు 1,13,071 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో హిందూపురంలో 77.59 శాతం ఓట్లు పోలయ్యాయి. పలు చోట్ల అర్థరాత్రి వరకూ ఓటింగ్ జరిగింది. మహిలలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు.
నవీన్ నిశ్ఛల్ నియోజకవర్గ బాధ్యుడుగా ఉన్నా, ఆయన్ను కాదని వైసీపీ అధిష్టానం ఈసారి కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్కు హిందూపురం టికెట్ ఇచ్చారు. ఎలాగైనా ఈసారి హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు పనిచేశారు. బాలయ్య స్థానికంగా అందుబాటులో ఉండడని, ఆ పార్టీ నేతల్లో నెలకొన్న అసమ్మతి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు తమవైపు ఉన్నాయని దీమా వ్యక్తం చేస్తున్నారు. ముప్పై ఏళ్లకు పైగా టీడీపీని ఆదరించిన పురం వాసులు ఈ సారి తమవైపు ఉన్నారని జగన్ కు ఒక్క చాన్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారని గెలుపు తమదేనని చెబుతున్నారు.
హిందూపురంలో తమకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, అది ఎన్నటికీ చెక్కుచెదరదని అంటోంది తెలుగుదేశం. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను బాలకృష్ణ ఐదేళ్లలో తీర్చారని చెబుతున్నారు. తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపుతూ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.96 కోట్లతో పైప్ లైన్ నిర్మించి పట్టణానికి నీరందిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పట్టణంలో ఉన్న ఓటర్లు మరోమారు బాలయ్యకు పట్టం కట్టారన్న విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధరా దేవి అన్నీ తానై వ్యవహరించారు. ప్రచారం మొత్తం ఆమె కనుసన్నల్లో నడిచింది. అసమ్మతి నేతలను బజ్జగిస్తూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలయ్య చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆ పార్టీ నేతలంటున్నారు.
టీడీపీ నెలకొన్న అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేకత పార్టీలోకి టీడీపీ నుంచి వలస వచ్చిన కీలక నేతల పరపతి తమకు పనిచేసిందని వైసీపీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి హిందూపురంలో విజయం తమదేనని చెబుతున్నారు. పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో నిజంగా విజేతలు ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది. ఈ సస్పెన్స్కు మే 23న తెరపడుతుంది. హిందూపురంలో లెజెండ్ హిట్ కొడతాడా వైసీపీ బోనీ చేస్తుందా అన్నది తేలిపోతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire