తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం...తొలి విడతలో ఆరు నుంచి 8మంది కేబినెట్లోకి?
ఈనెల 18న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఆశావహులంతా అటు ప్రగతి భవన్ వైపు ఇటు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఈనెల 18న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఆశావహులంతా అటు ప్రగతి భవన్ వైపు ఇటు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మంత్రి పదవులతోపాటు విప్లు, పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులను కూడా భర్తీ చేయనుండటంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజే కేబినెట్ ఎక్స్పాన్సన్ ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి మినిమమ్ మంత్రివర్గం అవసరం కావడంతో తొలి విడతలో ఆరు నుంచి 8మందిని కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు.
తొలి విడత విస్తరణలో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటూనే అత్యంత సన్నిహితులు, విధేయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్రెడ్డి మెదక్ నుంచి హరీష్రావు, పద్మాదేవేందర్రెడ్డి కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కడియం శ్రీహరి, రెడ్యానాయక్ మహబూబ్నగర్ నుంచి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నల్గొండ నుంచి జగదీశ్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు కూడా పదవులు ఆశిస్తున్నట్లువారిలో ఉన్నారు.
మంత్రివర్గంలో స్థానం లంభించనివాళ్లకు విప్ పోస్టులు, పార్లమెంటరీ సెక్రటరీలు, కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ పోస్టులకు రేఖానాయక్, బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, కోనేరు కోనప్ప, ఒడితెల సతీష్కుమార్, షకీల్, గంగుల కమలాకర్, రామలింగారెడ్డి, జీవన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, వివేకానందగౌడ్, కర్నె ప్రభాకర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే మినీ కేబినెట్ ఏర్పాటవుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దాంతో అటు మంత్రి పదవులు ఇటు పార్లమెంటరీ సెక్రటరీ, విప్ పోస్టులు ఆశిస్తున్న నేతలంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire