సరికొత్త రికార్డు సృష్టిస్తున్న నిజామాబాద్‌ ఎన్నిక నిర్వహణ ఖర్చు

సరికొత్త రికార్డు సృష్టిస్తున్న నిజామాబాద్‌ ఎన్నిక నిర్వహణ ఖర్చు
x
Highlights

185మంది అభ్యర్థులతో రికార్డులకెక్కిన ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల వ్యయంలోను ముందుంది. ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, హెలికాప్టర్...

185మంది అభ్యర్థులతో రికార్డులకెక్కిన ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల వ్యయంలోను ముందుంది. ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, హెలికాప్టర్ వినియోగంతో ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతుంది. పార్లమెంట్ వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు 35 కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రికార్డులు మీద సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పార్లమెంట్ స్థానంగా ఉన్న నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల నిర్వహణ వ్యయంలో ప్రత్యేకత చాటుకుంటోంది. మామూలుగా పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్కో సెగ్మెంట్‌కు 3కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఒక్క నిజామాబాద్‌లో ఖర్చు 5కోట్లు దాటే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఇక్కడ ఎన్నికల వ్యయం 35కోట్ల రూపాయలు దాటుతుందనుకుంటున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో వీవీ ప్యాట్, ఒక్కో కంట్రోలింగ్ యూనిట్‌తో పాటు 12 చొప్పున 25వేలకు పైగా ఈవీఎంలు వినియోగిస్తున్నారు. మామూలుగా ఒక పోలింగ్ కేంద్రంలో నలుగురు సిబ్బందిని నియమిస్తారు. ఇక్కడ మాత్రం మరో ఇద్దరిని అదనంగా కేటాయించారు. ఇలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిసి సిబ్బంది సంఖ్య 9వేలు దాటనుంది. వీరితో పాటు సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, మండల స్థాయి పరిశీలకులు , ప్రత్యేక పరిశీలకులను నియమించారు.

ఈవీఎంల పరిశీలనకు హైదరాబాద్, బెంగళూరు నుంచి 150 మంది ఇంజనీర్లు నిజామాబాద్ వచ్చారు. పోలింగ్ రోజు సుమారు 400 మంది ఇంజనీర్ల సేవలు వినియోగించుకుంటారు. 185 మంది అభ్యర్థుల వివరాలతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే మార్చడానికి హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో పోలింగ్‌ వేళలను సవరించినట్లు సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని చెప్పారు. సాయంత్రం 6 గంటలలోగా క్యూలో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఓటరు స్లిప్పులు, ఎపిక్‌కార్డుల పంపిణీ 95 శాతం పూర్తయినట్టు చెప్పారు.

నిజామాబాద్ బరిలో నిలిచిన 176 మంది రైతులు ఎన్నికలను వాయిదా వేయాలని ఓ వైపు కోరుతుండగా ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. మంగళవారం ఆర్మూరులో రైతులు ఐక్యత సభ నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories