ముస్లింలంతా నాకు ఓటేయాలి...లేకపోతే పనులు చేసేది లేదు

ముస్లింలంతా నాకు ఓటేయాలి...లేకపోతే పనులు చేసేది లేదు
x
Highlights

యూపీలో ఎన్నికల యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోడానికి ఉచితాలు, హామీలు దాటేసి ఇప్పుడు బెదిరింపులు, వార్నింగుల వరకూ ప్రచారాలు...

యూపీలో ఎన్నికల యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోడానికి ఉచితాలు, హామీలు దాటేసి ఇప్పుడు బెదిరింపులు, వార్నింగుల వరకూ ప్రచారాలు చేరిపోతున్నాయ్..సౌమ్యురాలిగా, సమర్ధనేతగా గుర్తింపు తెచ్చుకున్న ఇందిర చిన్న కోడలు ప్రచారంలో ఒక్కసారిగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? వినయంగా ఓట్లడిగే రోజులు పోయాయనుకున్నారా? అందుకే బెదిరించి ఓటడుగుతున్నారా? మేనక వార్నింగుల వెనక మర్మమేంటి?

బీజేపీ మంత్రి, అందరికీ చిరపరిచితురాలైన మేనకాగాంధీ ప్రచారంలో ఒక్క సారిగా దూకుడు పెంచారు. ఎన్నికల ముందు ఓట్ల పోలరైజేషన్ కు తెర తీశారు. మేనకకు మంచి వాగ్ధాటి ఉంది. ఆకట్టుకునే రూపం ఉంది. ఇందిర కోడలన్న చరిష్మా ఉంది. అన్నింటికీ మించి బీజేపీలో సమర్ధవంతమైన మంత్రిగా గుర్తింపు ఉంది. అయినా ఈసారి ఆమె ఎందుకో ప్రచారంలో తడబడుతున్నారు. పదిరోజుల నుంచి సుల్తాన్ పూర్ లో మాటేసిన మేనక ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. సమాయనుకూలంగా మాట్లాడటంలో ఆమె దిట్ట. 20 % మైనారిటీలున్న సుల్తాన్ పూర్ లో వారి ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే కొంత శృతి మించారు. మైనారిటీల ఓట్లు మహా ఘటబంధన్ కు పడతాయేమోనన్న భయంతో ఆమె మాట తూలారు.

ముస్లింలంతా తనకు ఓటు వేయాలని లేని పక్షంలో వారి డిమాండ్లను , అవసరాలను తాను తీర్చలేకపోవచ్చని సున్నితంగా హెచ్చరించారు. ఈ ఎన్నిక తానెప్పుడో గెలిచేశానని ఇక ముస్లింలే నిర్ణయించుకోవాలనీ అన్నారు. తన గెలుపు ఖాయమేనని కానీ ముస్లింల ప్రమేయం అందులో లేకపోతే అది గెలుపుగా అనిపించుకోదనీ అన్నారు మేనక ప్రేమైనా, సంతోషమైనా ఇచ్చి పుచ్చుకోవాలని ఆమె అన్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ తాను అన్ని వర్గాలకూ ప్రేమను పంచుతూనే ఉన్నానని కానీ ఈ ఎన్నికల్లో గెలుపులో అందరి ప్రమేయం ఉండాలని కోరుకుంటున్నట్లు మేనక తెలిపారు.

ఈ ఎన్నికల్లో ముస్లింలు తనకు ఓటు వేయడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ తొలగించాలన్నారు. ముస్లింలు అరకొరగా ఓట్లు వేసి ఏవైనా పనుల కోసం తన దగ్గరకొస్తే తాను మనస్ఫూర్తిగా పని చేయలేకపోవచ్చని సంకేతాలిచ్చారు అందుకే అంతా తనకు ఓటేయాలని మేనక కోరారు. సుల్తాన్ పూర్ లో ఫలితాల రోజు వంద శాతం ఓట్లు పడినదీ లేనిది తెలుసుకుంటానని ముస్లింల ఓట్లు పడకపోతే వారి పనులు చేసేది లేదని అన్నారు. తమ సంజయ్ విచార్ మంచ్ ఫౌండేషన్ ఈ ప్రాంతానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని, అయినా బీజేపీకి ఓటు వేయకపోతే ఎలా అంటూ నిలదీశారు.

దాదాపు పది రోజుల నుంచి ఈ నియోజక వర్గంలో గడప గడపకు ఆమె తిరుగుతున్నారు. ప్రస్తుతం ఈ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ 2009లో తాను గెలచిన ఫిలిబిత్ సీటుకు మారారు ఫిలిబిత్ సీటును మేనకగాంధీ ఇప్పటి వరకూ ఆరుసార్లు గెలిచారు.

ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై పంచ్ లు వేసే మేనక తోటి కోడలు సోనియా కుటుంబం ప్రస్తావన మాత్రం తేవడం లేదు బీఎస్పీ అధినేత్రి మాయావతి సీట్లు అమ్ముకుంటున్నారని ఒక్కో సీటును15 నుంచి 20 కోట్లకు అమ్ముకుంటున్నారని తెలిపారు. మాయావతికి 77 భవనాలున్నాయని అందులో ఉండేవారంతా ఆమె టిక్కెట్లను అమ్ముకుంటోందనే చెబుతున్నారని మేనక ఆరోపించారు.

యూపీలోని సుల్తాన్ పూర్ నియోజక వర్గం తీరు తెన్ను ఏంటి? ఇక్కడ ఓటర్ల జీవన శైలి, సరళి ఎలా ఉంటుంది?మేనకకు ఈసారీ గెలుపు నల్లేరుపై నడకేనా? ఫిలిబిత్, సుల్తాన్ పూర్ మేనక, కుమారుడు వరుణ్ ఇద్దరికీ మంచి పట్టున్న నియోజక వర్గాలు మరి అక్కడి అసలు సీన్ ఏంటో చూద్దాం.

2019 సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీ గద్దె కోసం జరుగుతున్న పోరులో యూపీని గెలిచేందుకు అన్ని పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. స్టార్ కాంపెయినర్లను రంగంలోకి దింపుతున్నాయి. ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తున్నాయి. దేశభక్తిని రగిలిస్తున్నాయి. 80 సీట్లున్న యూపీలో కనీసం 70 సీట్లు గెలవాలని బీజేపి తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ73 సీట్లు దక్కాయి. కానీ మోడీ ఇమేజ్ కు ఈ మధ్య కాలంలో జరిగిన డ్యామేజీ కారణంగా బీజేపీ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది ఇక యూపీలోని సుల్తాన్ పూర్ నియోజక వర్గం నుంచి ఇందిర చిన్న కోడలు మేనక బీజేపీ నుంచి పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల నాటికి ఈ నియోజక వర్గం ఆమె కుమారుడు వరుణ్ గాంధీ చేతిలో ఉండేది. స్థానిక బీఎస్పీ అభ్యర్ధి పవన్ పాండేపై 42 శాతం ఓట్ల ఆధిక్యతతో వరుణ్ ఈ సీటు గెలుచుకున్నారు. నియోజక వర్గం విషయానికొస్తే 2014 లెక్కల ప్రకారం సుల్తాన్ పూర్ లో 1,703,698 మంది ఓటర్లున్నారు. వీరిలో 9 లక్షల 10 వేల మంది మగవారు, 7 లక్షల93 వేలమంది మహిళలు ఉన్నారు. సుల్తాన్ పూర్ లో గత ఎన్నికల్లో 56 శాతం మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు.

సుల్తాన్ పూర్ లో 5 అసెంబ్లీ సిగ్మెంట్లున్నాయి. గోమతీ నదీ తీరాన ఉన్న ఈ నియోజక వర్గం వ్యవసాయప్రధానమైనది. గత ఎన్నికల్లో అన్ని పార్టీలనుంచి ఇక్కడ కనీసం ఆరుగురు అభ్యర్ధులు పోటీలో నిలిచారు. సుల్తన్ పూర్ బాగా వెనుకబడిన ప్రాంతం సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు, రక్షిత మంచి నీరు సైతం లేని ప్రాంతం ఇక్కడ ఆడ మగ లింగ నిష్పత్తిలో కూడా తేడాలే ఆడపిల్లల సంఖ్య ఇక్కడ చాలా చాలా తక్కువగా ఉంది. 82 శాతం హిందువులున్న ప్రాంతం కావడంతో బీజేపీ ఈ నియోజక వర్గంపై ఆశలు పెట్టుకుంది. మేనక, వరుణ్ యూపీలోని సుల్తాన్ పూర్, ఫిలిభిత్ నియోజక వర్గాలను మార్చుకుంటూ గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా మేనక సీటు వరుణ్ కు, వరుణ్ సీటును మేనకకు కేటాయించింది బీజేపీ అధిష్టానం.

మేనకా గాంధీ ఈ సీటును తాను ఇప్పటికే గెలిచేసినట్లు ప్రకటించి దూకుడు ప్రదర్శించారు. తన గెలుపు ఖాయమని ముస్లింలు తనతో కలిసొచ్చి సహకరించాలని, వారి ప్రమేయం లేకున్నా గెలుపు ఈజీయే అయినా.. వారు మర్యాదగా కలిసొస్తే బెటర్ అన్న సంకేతాలిచ్చారు. ఓట్ల ఏకీకరణ పేరుతో మేనక ఈ బెదిరింపులకు దిగారా? మేనక బెదిరింపులపై ఇప్పటికే విపక్షాలు ఈసీకి కంప్లయింట్ ఇచ్చాయి. మేనక ఇచ్చిన ఈ ఫినిషింగ్ టచ్ ఆమెకు వరమా? శాపమా తేలాలంటే ఎన్నికలయ్యే దాకా ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories