కేసీఆర్ ఆహ్వానంపై జగన్ ఎలా స్పందిస్తారనేదానిపై ఆసక్తి ?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బుధవారం కీలకమైన రోజుగా మారింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బుధవారం కీలకమైన రోజుగా మారింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. గత ఎన్నికల సందర్భంగా చెప్పినట్టుగానే ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో టీఆర్ఎస్ అగ్రనేతలు నేడు చర్చలు జరపనున్నారు.
ఏపీలో కోడి పందాల సెగలు , తెలంగాణలో సంక్రాంతి సంబరాలు జరుగుతుండగానే తెలుగు రాజకీయాల్లో ఈక్వెషన్లు మారాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లను వేగవంతం చేసిన సీఎం కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత జగన్తో చర్చలు జరపాలంటూ పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించారు. ఆయనతో పాటు పలువురు సీనియర్లకు ఈ బాధ్యతలను అప్పగించారు. దీంతో టీఆర్ఎస్ కీలకనేతలు వైసీపీ అధినేత జగన్తో భేటి అయ్యి ఫెడరల్ ఫ్రంట్పై చర్చించనున్నారు. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
దక్షిణాదిలో బలంగా ఉన్న బీజేడీతో ఇప్పటికే చర్చలు జరిపిన కేసీఆర్ ఏపీలోని ప్రాంతీయ పార్టీలపై కన్నేశారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన చేరి టీడీపీ పోటీ చేయడంతో ప్రతిపక్ష వైసీపీకి దగ్గరయ్యారు. మరో ప్రాంతీయ పార్టీ జనసేన ఉన్నా బలమైన నాయకత్వం లేకపోవడం, సంస్ధాగతంగా పార్టీ రూపుదిద్దుకోకపోవడంతో వైసీపీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి వినోద్, శ్రవణ్ కుమార్ రెడ్డిలు జగన్ని కలసి ఫెడరల్ ఫ్రంట్పై చర్చలు జరపనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, దేశాభివృద్దికి ప్రణాళికలపై జగన్తో చర్చించబోతున్నారు.
ప్రస్తుత పరిస్దితుల్లో కేసీఆర్ ఆహ్వానంపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్కు అనుకూలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నా ఎన్నికలకు ముందే ఫెడరల్ ఫ్రంట్లో చేరే విషయంపై ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ జట్టుకట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్, బీజేపీలకు సమదూరమంటూ జగన్ ప్రకటనలు చేసిన నేపధ్యంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు.
టీఆర్ఎస్- వైసీపీల మధ్య జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైనవంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో సందర్భంగా చెప్పినట్టుగానే ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు ఫెడరల్ ఫ్రంట్ను వేదికగా చేసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అటు టీడీపీని ఓడించడం ఇటు తాము జాతీయ స్ధాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా పొత్తుల రాజకీయం ప్రారంభించినట్టు భావిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire