ఆపరేషన్ ఇమ్మిగ్రేషన్...అడ్డదారిలో అగ్రరాజ్యం వచ్చేవారికి చెక్...
అమెరికాలో చదువుకోవడం, ఉద్యోగం చేయడం, అక్కడ నివశించడం మన వారి కల. అందుకోసం ఎంత పనైనా చేస్తున్నారు. అక్కడే ఏం జరుగుతుందన్నది కూడా లెక్క చేయడం లేదు....
అమెరికాలో చదువుకోవడం, ఉద్యోగం చేయడం, అక్కడ నివశించడం మన వారి కల. అందుకోసం ఎంత పనైనా చేస్తున్నారు. అక్కడే ఏం జరుగుతుందన్నది కూడా లెక్క చేయడం లేదు. తాజాగా నకిలీ స్టూడెంట్ వీసాలు పొంది ఓ ఫేక్ యూనివర్శిటీలో చదువుకోవడానికి వెళ్లి అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగింది?
అమెరికా వెళ్లడమే వారి లక్ష్యం. అందుకు ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. వీరి ఆతృతను పసిగట్టిన కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు పెద్ద ఎత్తున డబ్బులు దండుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. వీసా గడువు ఎప్పటి దాకా ఉందో ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో దళారీల సహకారంతో అమెరికాలోకి అక్రమంగా ఎంటరై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు.
విద్యార్థులను అమెరికా పంపే కన్సల్టెన్సీ సంస్థలు అక్కడ ఆ యూనివర్శిటీ ఉందా, లేదా అన్నది కూడా చూడటం లేదని, విద్యార్థులకు గానీ, వారి తల్లిదండ్రులకు గానీ, అక్కడ సమచారం ఇవ్వకపోవడంతో దారుణంగా నష్టం జరుగుతోందని హైదరాబాద్లోని పలువురు కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. కచ్చితంగా విదేశాలకు వెళ్లేవారు డాక్యుమెంటేషన్ చూసుకోవాలని, గుడ్డిగా కన్సల్టెన్సీ సంస్థలను నమ్మొద్దని సూచిస్తున్నారు.
అయితే, నకిలీ యూనివర్శిటీ ఏర్పాటుచేసి నకిలీ స్టూడెంట్ వీసా రాకెట్ గుట్టు విప్పిన ఘటనలు గతంలోనూ జరిగాయి. తాజాగా ఫర్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు విసిరిన వలలో నకిలీ వీసాలతో వెళ్లిన విద్యార్థులు పట్టుబడ్డారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికాలో మరో ట్రైవ్యాలీ వంటి ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలో అనధికారికంగా నివసించేందుకు ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషంలో ఏర్పాటు చేసిన యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ద్వారా తమ పంజా విసిరారు. దీంతో వందల మంది పట్టుబడ్డారు. వీరిని విద్యార్థులుగా చూపిస్తూ అమెరికాలో నివసించేందుకు సహకరిస్తున్న 8 మంది భారత సంతతికి చెందిన దళారీలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలో అక్రమ వలసదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారి గుట్టును బయటపెట్టేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా డెట్రాయిట్లో ఫర్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో నకిలీ యూనివర్శిటీని ఏర్పాటుచేసింది. ఉన్నత విద్య పేరుతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఈ ఎత్తుగడ వేశారు. దీంతో ఈ అక్రమ వలసదారుల వ్యవహారం బయటపడింది.
ఫర్మింగ్టన్ యూనివర్శిటీలో ప్రవేశాలు ప్రారంభించి 900 మందిని విద్యార్థులుగా చేర్చుకున్నారు. వీరిలో చాలా మంది భారత్ నుంచి వచ్చిన వారే. ఈ యూనివర్శిటీలో తరగతులు జరగవు. కేవలం వారి నుంచి డబ్బు తీసుకుని విద్యార్థి వీసాలు ఇస్తారు. ఇందుకోసం 8 మంది దళారులు పనిచేశారు. ఇలా నకిలీ పత్రాలతో స్టూడెంట్ వీసా సాధించిన వారంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందాల, ఫణిదీప్ కర్నాటి, ప్రేమ్ రాంపీసా, సంతోష్ శామా, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ ప్రత్తిపాటి ఉన్నారు.
గత రెండు రోజులుగా అధికారులు సోదాలు చేపట్టి ఈ నకిలీ యూనివర్శటీలో విద్యార్థులుగా చేరిన వందల మంది విదేశీయులను అరెస్టు చేశారు. ఓహైయో, టెక్సాస్, జార్జియా, మిస్సోరీ, న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సహకరించిన 8 మంది భారతీయులను అరెస్టు చేసి డెట్రాయిట్ పోలీస్స్టేషన్లో ఉంచారు. అయితే మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేశారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.
ఇలా నకిలీ యూనివర్శిటీ ఏర్పాటుచేసి నకిలీ స్టూడెంట్ వీసా రాకెట్ గుట్టు విప్పిన ఘటనలు గతంలోనూ జరిగాయి. 2016లో న్యూజెర్సీలో ఇలాగే ఓ నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు తేలడంతో 21 మందిని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. ఇప్పుడు పర్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు విసిరిన వలలో నకిలీ వీసాలతో వెళ్లిన విదేశీయులు పట్టుబడ్డారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire