బెంగాల్ హింస: నేడు అఖిలపక్ష భేటీ

బెంగాల్ హింస: నేడు అఖిలపక్ష భేటీ
x
Highlights

ఎన్నికలు, తదనంతరం ప్రజ్వరిల్లిన హింసతో పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. వరస రాజకీయ హత్యలు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిపై...

ఎన్నికలు, తదనంతరం ప్రజ్వరిల్లిన హింసతో పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. వరస రాజకీయ హత్యలు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి ఆరా తీశారు. ఈ అంశంపై చర్చించేందుకు గవర్నర్‌ కేఎన్‌ త్రిపాఠి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ సహా ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు.తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలో బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ టీఎంసీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా తాజాగా వెలుగులోకి వచ్చిన మరో హత్యోదంతం ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ హత్యలకు వ్యతిరేకంగా సోమవారం 'బ్లాక్ డే' నిర్వహించిన బీజేపీ బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ తలపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం 18 మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్న ఈ ఆందోళన కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోల్‌కతాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించడానికి యత్నించిన బీజేపీ శ్రేణులను బెంగాల్ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బీజేపీ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. దీనికి ప్రతిగా వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. నీళ్ల బాటిళ్లు విసిరారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి మమత సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్‌లో రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆశిష్.. మాల్దాలోని ఓ ప్రాంతంలో నిన్న శవమై కనిపించాడు. అతడి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ హత్య విషయం వెలుగులోకి రావడంతో బెంగాల్ రణరంగంగా మారింది. తమ పార్టీ కార్యకర్తలు వరసగా దారుణ హత్యలకు గురవుతున్నారంటూ బీజేపీ ఆందోళనను ఉధృతం చేసింది. రాష్ట్రంలో రాజకీయ హత్యలపై ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో పెట్టడంలో మమతా సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు. మరోవైపు లోక్‌‌సభ ఫలితాలు వెలువడిన తర్వాతే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను సక్రమంగానే అమలు చేస్తున్నామని తెలిపారు. హత్యలకు ఎవరు కారణమైనా వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories