నాలుగేళ్ళ ఏడాది క్రితం వరకు తనకు ఎదురు లేదని భావించిన బీజేపీకి కష్టకాలం మొదలైందా..? ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడానికి కారణమేంటి..? మోడీ మేనియా...
నాలుగేళ్ళ ఏడాది క్రితం వరకు తనకు ఎదురు లేదని భావించిన బీజేపీకి కష్టకాలం మొదలైందా..? ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడానికి కారణమేంటి..? మోడీ మేనియా తగ్గిందా..? అమిత్ షా మ్యాజిక్ పని చేయడం లేదా..? విపక్షాల ఐక్యతే కమల నాథుల కొంప ముంచుతోందా..? మొత్తంగా 2019 ఎన్నికల్లో మోడీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనా..?
వరుసగా ఎదురౌతున్న పరాభవాలు బీజేపీకి కొరుకుడు పడడం లేదు. ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్ పూర్, పూల్పుర్ ఉప ఎన్నికలతో మొదలు పెడితే తాజా ఉప ఎన్నికల వరకు కమలనాథులకు దాదాపుగా అన్నీ పరాజయాలే ఎదురయ్యాయి. కొద్ది నెలల క్రితం గోరఖ్ పూర్, పూల్పుర్ సిట్టింగ్ లోక్ సభ స్థానాలను కోల్పోపోయిన బీజేపీ..తాజా ఉప ఎన్నికల్లోనూ మరో రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ పరాజయం పాలైంది. అంతేకాదు యూపీ, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒకటకంటే ఒకే సీటును గెలుచుకుంది.
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రాభవం నాలుగేళ్ళకే తగ్గుతున్నట్లు స్పష్టమౌతోంది. 2014లో బీజేపీ సొంతంగా 282 స్థానాలను సాధించగా..2018 నాటికి వరుస ఉపఎన్నికల్లో ఆరు సీట్లను కోల్పోయింది. తాజాగా కైరానాలో గోరఖ్ పూర్ కు మించిన ఘోరపరాభవం ఎదురైంది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హుకుం సింగ్ 2,36,628 ఓట్ల ఆధిక్యంతో గెలవగా ఇప్పుడు ఆయన కుమార్తె మృగాంక సింగ్ కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. యూపీలో విపక్షాల ఐక్యత ముందు బీజేపీ పావులు పనిచేయలేదు. మొత్తంగా కైరానా లోక్సభ ఫలితం కమలనాథులను మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన యడ్యూరప్ప, శ్రీరాములు ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో లోక్సభలో బీజేపీ బలం ప్రస్తుతం 272కి పడిపోయింది.
నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుని ఘనవిజయాలు సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న కమలనాథులకు ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని చెబుతున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మింగుడు పడడంలేదు. అయితే బీజేపీ ఓటమికి భగ్గుమంటున్న పెట్రో ధరలు ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెట్రో ధరలు పైపైకి ఎగబాకిన కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో బీజేపీపై ప్రయోగించారని అంటున్నారు. అలాగే ప్రతిపక్ష శక్తులన్నీ ఏకం కావడం మరో కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్నికల్లో బీజేపీ ఆడిన ఆటనే తామూ అడుతున్నామని ఎస్పీ అధినేత అఖిలేష్ వ్యాఖ్యానించారు. విపక్షాలను చీల్చి తమ విజయానికి గండి కొట్టాలన్న ఎత్తుగడలకు బ్రేక్ వేశామని అన్నారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానంపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పా్టీ ఇంతగా దెబ్బతినడానికి కారణం బీజేపీ దురహంకారమేనన్నారు. ఓటమి నుంచి బయటపడి మళ్ళీ విజయం సాధించడానికి తగిన వనరులు బీజేపీకి ఉన్నాయన్న స్వామి..అయితే అందుకు నూతన విధానాలు అవసరమని వ్యాఖ్యానించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire