గోదావరి ఉగ్రరూపం

గోదావరి ఉగ్రరూపం
x
Highlights

భారీగా వరద నీరు రావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లంక, తీరప్రాంత గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే పునరావాస కేంద్రాలు...

భారీగా వరద నీరు రావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లంక, తీరప్రాంత గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసిన అధికారులు... బాధిత గ్రామాల ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామగ్రి అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లో పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 46 అడుగులకు చేరగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో తీరప్రాంత గ్రామాలను ముంచెత్తింది. తూర్పుగోదావరి జిల్లా పోడిపల్లి, దేవీపట్నం, పోచమ్మగండి, తొయ్యారు, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దేవిపట్నం మండలంలోనే 32 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తీర, లంక ప్రాంత గ్రామాల్లో ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ముంపు గ్రామాలను ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ సందర్శించారు.

ఇటు వరదతో పోలవరం ప్రాజెక్టు ముగినిగిపోయింది. స్పిల్‌వే మీదుగా 2 మీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తోంది. కాఫర్‌ డ్యాం వద్ద వరద ప్రవాహం 28 మీటర్లకు చేరింది. స్పిల్‌వే పొడవునా 48 గేట్ల నుంచి క్లస్టర్‌ స్థాయి దాటి రెండు మీటర్ల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. మరోవైపు పోలవరం మండలంలోని 19 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగుకు వరద చేరడంతో 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. గోదావరి ముంపు గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.34 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 9.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతిపై ఏపీ సీఎం జగన్‌ ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రస్తు‍త పరిస్థితులపై ఆయన సమాచారం కోరారు. సీఎం కార్యాలయ అధికారులు.. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న సీఎంకి ఉభయ గోదావరి ప్రాంత పరిస్థితులను వివరించారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories