తెలుగుదేశం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్మెన్ల రక్షణను ఉపసంహరించారు. చడీచప్పుడు లేకుండా శనివారం రాత్రి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు...
తెలుగుదేశం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్మెన్ల రక్షణను ఉపసంహరించారు. చడీచప్పుడు లేకుండా శనివారం రాత్రి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు మంత్రులందరికీ 2+2 చొప్పున భద్రత వ్యవస్థ ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన తరువాత కూడా ఇదే రక్షణను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మాజీలకు రక్షణ ఉపసంహరించుకున్న నేపథ్యంలోనే ఈ జిల్లాలో తాజాగా నిర్ణయాన్ని అమలు చేశారు. ఎక్కడా రాత పూర్వకంగా నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడ్డారు. నోటి మాటగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వెను వెంటనే మాజీలకు రక్షణగా ఉన్న గన్మెన్లు ఎక్కడికక్కడ వెనుతిరిగారు. వాస్తవానికి తమకు రక్షణ అవసరమని ఇంతకుముందే పోలీసులకు కొందరు విన్నవించినా ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్లకు ఉన్న భద్రతను పూర్తిగా తొలగించారు.
'ఎక్సైజ్శాఖ నిర్వహణ సమయంలో నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంది. అప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇది. నాకు రక్షణ ఇవ్వండి. సానుకూలంగా నిర్ణయం ప్రకటించండి' అంటూ మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. కాని ఆయన చేసిన విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం శనివారం రాత్రి మాజీ మంత్రి జవహర్కు భద్రతను ఉపసంహరించారు. నా మటుకు నాకు ఉన్న సమస్యలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళా. కాని ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే గన్మెన్లను ఉపసంహరించారు. ఇదెక్కడి న్యాయం. నాకు భద్రత కావాలి.. అంటూ జవహర్ వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఓట్ల లెక్కింపు పూర్తయిన దరిమిలా కొద్ది గంటల వ్యవధిలోనే మాగంటి బాబు, బడేటి బుజ్జి ఇద్దరూ తమ గన్మెన్లను ఉపసంహరించుకున్నారు. ఓటమిని అంగీకరిస్తూ వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వపరంగా తమకు భద్రత అవసరంలేదంటూ గన్మెన్లను తిప్పిపంపారు. ఇదిలా ఉండగా సాధ్యమైనంత మేర భద్రత కొనసాగిస్తామని పరోక్షంగా ప్రకటించినా ఆ మాట తప్పి వ్యవహరించినట్టు విమర్శలు ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలందరికీ శనివారం రాత్రి భద్రత ఉపసంహరించారు. ఒకవేళ ఎవరికైనా భద్రత అవసరం అని పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే ఈ మేరకు పూర్తిగా పరిశీలించి అవసరమనుకున్న పక్షంలోనే భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, భద్రతను తొలగించడంలో వేగంగా స్పందించారని, తాము చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదంటూ తాజా మాజీలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలవరం ఎమ్మెల్యేకు భద్రత పెంపు ఒకవైపు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ఓటమి పాలైన వారందరికీ భద్రతను ఉపసంహరిస్తూనే మరోవైపు అధికారపక్షంలో ఉన్న శాసన సభ్యుల విషయంలో మరికొన్ని జాగ్రత్తలను పోలీసులు పాటిస్తున్నారు. ఇప్పటిదాకా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సాధారణ ఎమ్మెల్యేగా 1+1 కేటిగిరిలో భద్రత కల్పిస్తున్నారు. కాని దీనిని తాజాగా సవరించారు. దీని ప్రకారం ఎమ్మెల్యే బాలరాజుకు మంత్రులతో సమానంగా 2+2 భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడం, అందున ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలు ఆంధ్రాలో విలీనం కావడం, మావోయిస్టుల సంచారం ఉండడం కారణంగా ఈచర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire