తరచూ మనోవేదనకు గురైన ఠాగూర్: లోకానికి వెల్లడించిన విశ్వకవి లేఖలు
మనోవేదన మనిషిని కుంగదీస్తుంది. ఏ పనీ చేయలేని దుస్థితికి చేరుస్తుంది. చాలా సందర్భాల్లో ఈ వేదనకు సరైన కారణమూ ఉండక పోవచ్చు. కేవలం ఊహల్లో ఏదో తోచి... మానసిక సంఘర్షణకు గురి కావడం.. ఒత్తిడిని ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సామాన్యులే కాదు.. మహా మహులు కూడా దీనికి అతీతులు కాదు. వీరిలో విశ్వకవి ఠాగూర్ కూడా ఉన్నారు. తాను ఎన్నోసార్లు మనోవేదనకు గురైనట్లు ఆయన లేఖల ద్వారా వెల్లడవుతోంది.
భారతదేశానికి తొలి నోబుల్ బహుమతిని తెచ్చి దేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుమడింపజేశారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. అంతటి మేధావి కూడా తరచూ డిప్రెషన్ కు గురయ్యేవాడట. కొన్ని సందర్భాల్లో అది తీవ్ర స్థాయిలో ఉండేదట. ఆ అన్ని సందర్భాల్లోనూ ఆయన వాటిని అధిగమించేందుకు నానా యాతనలూ పడేవారట.
సాహిత్యం, కళతో ప్రపంచప్రసిద్ధి చెందిన ఠాగూర్ చాలావరకూ ఏకాంతమైన అసంతృప్తి జీవితాన్ని గడిపారు. 1915 జనవరిలో బ్రేక్ డౌన్, డీప్ డిప్రెషన్ కు గురైన విశ్వకవి ఠాగూర్ ... ఉత్తర బెంగాల్ లోని పద్మానది ఒడ్డున బోటులో గడిపి ఈపరిస్థితి నుంచి కోలుకోగలిగారు. 1913లో అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టిన గీతాంజలి పుస్తకం రాశాక.. ఎక్కువ డిప్రెషన్ కి గురయ్యారు. 1913లో ఈపుస్తకానికి నోబుల్ బహుమతి వచ్చింది. ఆయన లేఖలు ఈవిషయాన్ని తెలియజేస్తున్నాయని... రవీంద్రుడిపై రాసిన తాజా బయోగ్రఫీ రవీంద్రనాథ్ ఠాగూర్ యాన్ ఇంటర్ ప్రిటేషన్ పుస్తకం చెబుతోంది. ప్రొఫెసర్ సవ్యసాచి భట్టాచార్య రచించిన ఈ పుస్తకం ఠాగూర్ జీవితంలోని ఎన్నో విశేషాలను, మరెన్నో కోణాలను ఆవిష్కరిస్తోంది.