యాంత్రిక్స్ దేవాస్ ఒప్పందంలో దోషి మాధవన్ నాయర్: తేల్చి చెప్పిన ఐదుగురు సభ్యుల కమిటీ
యాంత్రిక్స్ - దేవాస్ ఒప్పందంలో చోటు చేసుకున్న అవకతవకల పై ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అవకతవకలకు బాధ్యులెవరో తేల్చి చెప్పింది. ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ ప్రధాన దోషిగా కమిటీ నిర్దారించింది. నాయర్ తో బాటు ఈ డీల్ లో మరో ముగ్గురు శాస్త్రవేత్తల ప్రమేయం ఉన్నట్టు తెలపింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎస్-బాండ్ రేడియో తరంగాలను కేటాయింపుల్లో ఇస్రో నిబంధనలను ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాల పై కమిటీ సమగ్ర నివేదిక సమర్పించింది.. ఇస్రో ఛైర్మన్ గా మాధవన్ నాయర్ ఉన్న సమయంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో సైంటిఫిక్ సెక్రటరీ కె.భాస్కర నారాయణ, యాంత్రిక్స్ మాజీ ఎండీ కేఆర్.శ్రీధరమూర్తి, ఇస్రో వాణిజ్య విభాగం, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరక్టర్ కేఎన్.శంకర్ ల పాత్ర కూడా ఉందని కమిటీ తెలిపింది.
ఈ విచారణ కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ ప్రత్యూష సిన్హా నేతృత్వంలో జరిగింది. అయితే ఈ ఆరోపణలను నాయర్ ఖండిస్తున్నారు. కమిటీ ఒకే కోణంలో దర్యాప్తు చేసిందన్నారు. నిబంధనల్లో ఉన్న అసలు విషయాలను మరచిందన్నారు.