పాపికొండల విహారానికి తాత్కాలికంగా బ్రేకు
గోదావరిలో విహారించలనుకునే పర్యటకులకు అధికారులు బ్రేకులు వేశారు. నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో...బోట్లు నడపవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా... పాపికొండల్లో సరదాగా గడపాలని టిక్కెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది పర్యాటకులకు అధికారుల నిర్ణయం నిరాశను మిగిల్చింది. లాంచీలు తిరిగేందుకు గోదావరిలో నీటి ప్రవాహం సరిపోయే దశలో వున్నా హైటెక్ బోట్లతో పాటు లాంచీలను కూడా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో బోట్లు, లాంచీ యజమానులు కూడా సందిగ్ధంలో పడ్డారు.
ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో తగ్గడం... ఉన్న నీరు దాళ్వా నాట్లుకు విడుదల చేయడంతో నీటిమట్టం క్రమేపీ పడిపోతుండటంతో బోట్లకు ఇసుకమేటలు తగులుతున్నాయి. రానున్న నాలుగు రోజులూ ఈ పరిస్థితి మరింత కష్టంగా వుండే అవకాశాలు వున్నాయి. జనవరి రెండో తేదీ తర్వాత సీలేరు జలాలు గోదావరిలోకి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. ఈ జలాలు విడుదలైతే గోదావరి నీటిమట్టం పెరుగుతుందని, అంతేకాకుండా బోట్ల ప్రయాణానికి మరి కొద్దిరోజులు ఇబ్బంది రాకపోవచ్చునని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పురుషోత్తపట్నం, దేవీపట్నం ప్రాంతాలలో బోట్లకు ఇసుక మేటలు తగులుతుండటంతో... బోట్లు నిలిపివేయడమే మంచిదని హైటెక్ బోట్ల యజమానులు చెబుతున్నారు. పురుషోత్తపట్నం వద్ద బోట్లన్ని నిలిపివేయడానికి నిర్ణయించి అక్కడే లంగర్లు వేశారు. ప్రతి రోజూ పట్టిసీమ, పురుషోత్తపట్నం, రాజమండ్రి ల నుంచి బోట్లు, లాంచీలు కలిపి 30 వరకూ ప్రయాణం చేస్తున్నాయి.