అమెరికా అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మసూచుసెట్స్ మాజీ గవర్నర్ మిట్ రోమ్నీ మరో విజయం సాధించారు. గతవారం ఫ్లోరిడా ప్రైమరీలో గెలుపొంది మంచి ఊపులో ఉన్న రోమ్నీ ఇప్పుడు నెవడా ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
సిరియాలో ఆందోళనకారులపై ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో 200మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. హామ్స్ నగరంలో భద్రతా బలగాలు భారీ ఎత్తున మోర్టార్లు, ఫిరంగులతో ప్రభుత్వ వ్యతిరేకులపై దాడి చేశాయి. పిల్లలు, మహిళలు సహా దాదాపు 200మంది మృతిచెందారని విపక్షాల కార్యకర్తలు వెల్లడించారు. ఒక్క ఖల్దియే జిల్లాలోనే 140మంది మృత్యువాత పడ్డారని విపక్షాలకు చెందిన సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ, లోకల్ కోఆర్డినేషన్ కమిటీలు చెప్పాయి.
ఇప్పటి వరకూ అంగారకుడిపై జీవం ఆనవాళ్లు ఉండేదని శాస్త్రవేత్తలంతా భావించారు. కానీ తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో అంగారకుడిపై జీవం ఉండే అవకాశమే లేదని తేలింది. అంగారక గ్రహం పై 60కోట్ల ఏళ్ల పాటు తీవ్ర దుర్భర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఈ పరిస్థితుల్లో జీవం ఉండే అవకాశాలే లేవని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.