Next


బిజినెస్

ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్న మనీలాండరింగ్

     మనీ లాండరింగ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. తాజాగా ఆన్ లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ బయటపెట్టిన నిజాలు దేశ ఆర్థిక రంగంలో ఒక్కసారిగా కలకలం రేపాయి.ఇన్నాళ్లూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావించిన బ్యాంకులే మనీ లాండరింగ్ ను స్వయంగా ప్రోత్సాహిస్తుయన్న నిజాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. కేవలం భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది.

                  ప్రపంచ దేశాలు ఈనాడు సంపదకోసం ఆరాటపడటంలేదు. పెట్రోల్ బావుల కోసమో.. బంగారు గనుల కోసమో వెతకడంలేదు. ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్నది మనీ లాండరింగ్. ఎదురొచ్చే యుద్ధాల్ని ఆపేశక్తి అనేక దేశాలకు ఉంది. వాటిని తిప్పికొట్టే సామర్థ్యాన్ని పలుదేశాలు సొంతం చేసుకున్నాయి. కానీ వెనుకనుంచొచ్చే అపాయాన్ని తట్టుకునే శక్తి ప్రపంచ దేశాలకు కొరవడింది. తాజాగా ఈ మనీ లాండరింగ్ జాడ్యం భారత బ్యాంకింగ్ వ్యవస్థకు పాకిందన్న చేదు నిజం వెల్లడయింది. 
           
         భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ.. దేశ ఆర్థికరంగానికి వెన్నుముక.. ఇలాంటి బ్యాంకులు నల్లధనం చలామణీకి సహకరిస్తున్నాయన్న ఆరోపణలు.. ఇప్పుడు దేశ బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతున్నాయి. రహస్యంగా పరిశోధించి, ప్రత్యక్షంగా నేరాలను శోధించి నేరుగా లబ్ది దారులుగా అవతారమెత్తి అక్రమార్కుల వద్ద కధను నడిపి రహస్యాలను బయట పెట్టె కొబ్రా పోస్ట్... డబ్బు లావాదేవీలపై సంచలన విషయాలను బయటపెట్టింది.
           
       ప్రధానంగా నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చడానికి సహకరించే వ్యక్తుల పై ఆపరేషన్ రెడ్ స్పైడర్ పేరిట రహస్య శోధన చేసి మొత్తం 23బ్యాంకులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చింది. ఈ బ్యాంకులు, బీమా సంస్థలు చేసే సేవ.. నల్ల డబ్బుకు తెల్ల రంగు వేసి దర్జాగా మార్కెట్ లో తిప్పడం. దీర్ఘకాలిక పెట్టుబడుల్లోకి బినామీ వ్యక్తుల ఖాతాల్లోకి పంపించడం.. లేదంటే తమ వద్దే అదనపు లాకర్లను సమకూర్చి, కావాల్సినప్పుడు నేరుగా తీసుకునే సదుపాయం కల్పించడం.. అవసరం అనుకుంటే హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించి.. అక్కడి నుంచి వైట్ రూపంలో డబ్బు చేతికి అందేలా ఏర్పాట్లు చేయడం. ఈ వ్యవహారంలో తీగలాగుతూ వెళ్లిన కోబ్రాపోస్ట్ కు ఇలాంటి నిర్ఘాంతపరిచే వాస్తవాలు కళ్లబడ్డాయి.
           
     కేవైసీతో పాటు ఇతర నిబంధనలను తుంగలో తొక్కిన ఈ ఉదంతం మన బ్యాంకింగ్ వ్యవస్థలోని డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ ఉచ్చులో కూరుకుపోవడం మన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ప్రభుత్వాలు రూపొందిస్తున్న నిబంధనలు కేవలం సామాన్యులకేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవడానికి సవాలక్ష రూల్స్  ను ఏకరువు పెట్టే అధికారులు సంపన్నుల అక్రమ డబ్బుకు కాపలా కాసేందుకు సిద్ధపడిపోతున్నారు. ఇక ఇప్పటి వరకు మన ఆర్థిక వ్యవస్థకు బలమని భావిస్తూ వస్తున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయని తెలిసి ఆర్థిక వేత్తలు నివ్వెరపోతున్నారు.
                 
       మరోవైపు బ్యాంకులు మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయన్న కోబ్రాపోస్ట్ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలను ప్రారంభించింది. ఈ అంశంపై దర్యాప్తు పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆర్ బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడే ఆర్ బీఐ గట్టి చర్యలు చేపట్టి ఉంటే, మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేవని ఆర్థిక వేత్తలన్నారు. 
         
      ఇలా భారత బ్యాంకింగ్ వ్యవస్థలోకి పాకింది మనీ లాండరింగ్.. ఇంతకి మనీ లాండరింగ్ అంటే ఏమిటీ..? అక్రమంగా సంపాదించిన డబ్బును.. సక్రమంగానే వచ్చినట్లు ఎలా చూపిస్తున్నారు..? ఇందుకు అక్రమార్కులు అనుసరిస్తున్న విధానాలేంటీ..? 
             
      ఏవరైనా కష్టం చేసి సంపాదిస్తారు. వ్యాపారం, ఉద్యోగమో, వ్యవసాయమో చేస్తు బతకుతారు. కానీ కొందరు ఇందుకు విరుద్ధంగా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తారు. అంటే.. నేరం. స్మగ్లింగ్ కు పాల్పడ్డం, డ్రగ్స్ సరఫరా, ఉగ్రవాదులకు సహకరించడం, పన్నులు ఎగ్గోట్టడం ఇలాంటివన్నమాట. అయితే ఇవన్నీ చట్ట ప్రకారం నేరం. ఇలా చట్టానికి లోబడి కాకుండా అక్రమంగా సంపాదించి నల్ల డబ్బును సక్రమ మార్గాల్లో సంపాదించామని వ్యవస్థలోకి చలామణీ చేయడమే మనీ లాండరింగ్. 
         
      ఇక ఇలా అక్రమంగా సంపాదించన డబ్బును తెల్ల డబ్బుగా మార్చేందుకు అక్రమార్కుల వేస్తున్న ఎత్తులను చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. మనీ లాండరింగ్ మూడు పద్ధతుల్లో కొనసాగుతుంది. మొదటిది ఆర్థిక వ్యవస్థలోకి అక్రమ నిధులు వచ్చి చేరడం. దీనినే ప్లేస్ మెంట్ అంటారు. రెండవది నిధులను ఇతర ఖాతాలు లేదా ఆర్థిక సంస్థలకు బదలాయించడం. దీనివల్ల నేర మూలాల నుంచి వచ్చిన ధనం.. నేర కార్యకలాపాలకు మరింత దూరమవుతుంది. ఇది లేయరింగ్. ఇక మూడవది ఇంటిగ్రేషన్. ఈ విధానంలో నిధులను స్వదేశంలో చట్టబద్ధంగా ఆస్తులను సంపాదించుకోవడానికి ఉపయోగిస్తారు.
 
     వివరంగా చెప్పాలంటే ముందుగా అక్రమంగా వచ్చిన పెద్ద మొత్తాన్ని చిన్న, చిన్న భాగాలుగా విడదీస్తారు. వీటికి వేరు పేర్లతో వేరు వేరు బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. అక్కడ నుంచి ఒకరి కోకరు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. ఆ తరువాత దీనిని షేర్లలోనో, కంపెనీల్లోనో పెట్టుబడులుగా పెడుతారు. అంతేకాకుండా కొన్ని సార్లు  అక్రమంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తారు. అక్కడ నుంచి ఈ నగదును తరలించడానికి బోగస్  కంపెనీలను సృష్టించి నగదును బదిలి చేసి తెల్ల డబ్బుగా మారుస్తారు.
 
    ఉదాహారణకు ఇటీవలే  వచ్చిన రజనీకాంత్ శివాజీ సినిమాలో ఈ సీన్ చూస్తే విషయం మీకు సులభంగా అర్థమవుతుంది. ఇలా నల్లడబ్బు అంతా అధికారింగా చట్టబద్ద సొమ్ము అయిపోతుంది. మరో పక్క భారత్ మార్కెట్ లోకి విదేశాల నుంచి ఎఫ్ డీఐ రూపంలో ఎక్కువగా మారిషస్  నుంచి డబ్బు వచ్చి చేరుతుంది. భారత్ కు -మారిషస్ కు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మారిషస్  నుంచి డబ్బు తెచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. దానిపై ఎలాంటి పన్ను విధించదు. ప్రపంచంలోని పలు దేశాలు మారిషస్ కు తమ డబ్బును తరలించి అక్కడి నుంచి భారత్ కు రప్పిస్తారు.
 
     గత కొన్ని నెలలకు ముందు మారిషస్  నుంచి మన స్టాక్  మార్కెట్ లో పెట్టుబడులపై పన్ను విధిస్తామని మన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించడంతో ఆ రోజు స్టాక్ మార్కెట్ ఒక్క రోజే 1,000పాయింట్లు కుప్పకూలింది. దీంతో ప్రణబ్ దాకు ముచ్చెమటలు పట్టి ఇప్పట్లో ఆ ప్రతిపాదన లేదని పార్లమెంటులో ప్రకటన చేయాల్సి వచ్చింది. దాంతో స్టాక్  మార్కెట్  కుదుటపడింది. ప్రస్తుతం హాట్  టాపిక్ గా మారిన జగన్  కంపెనీలోకి కూడా మారిషస్ నుంచి నిధులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరుపుతోంది. 
           
     మనీ లాండరింగ్ కు  నిలువెత్తు ఉదాహారణాలు ఎన్నో ఉన్నాయి. 2009లో డ్రగ్స్ సరఫరా ద్వారా సంపాదించిన 207మిలియన్ డాలర్లు ఒక  ఇంట్లో దొరకడం ప్రపంచవ్యాప్తంగా సంచలన సృష్టించింది. తాజాగా ఐరోపాలోనే అతి పెద్ద బ్యాంకు అయిన హెచ్ ఎస్ బిసి కూడా మనీ లాండరింగ్ కు పాల్పడ్డట్లు అమెరికన్ సెనేట్ దర్యాప్తులో వెల్లడయింది.
             
     అంతర్జాతీయంగా స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా, ఉగ్రవాదులకు సహకరించడం, బెట్టింగ్ ల ద్వారా నల్ల ధనం ఎక్కువుతోంది. 2009 మెక్సికోలో ఒకేసారి ఒక ఇంట్లో 207మిలియన్ డాలర్ల డబ్బులు దొరికాయి. డ్రగ్స్ సరఫరా ద్వారా ఈ మొత్తాన్ని కూడబెట్టిన ఒక స్మగ్లర్ ఈ మొత్తాన్ని తన ఇంట్లో దాచుకున్నాడు. బ్రిటన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఐరోపాలోనే అతి పెద్ద బ్యాంకు అయిన హెచ్ ఎస్ బిసి, మెక్సికన్ మాదక ద్రవ్య వ్యాపారుల ద్వారా కోట్లాది డాలర్ల మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అమెరికన్ సెనెట్ దర్యాప్తులో వెల్లడయింది.
 
     ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80కి పైగా దేశాలలో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. సంస్థ నిర్వహణలో యాజమాన్యం ఒకదాని వెంట ఒకటిగా ఎదుర్కొంటున్న వరుస వైఫల్యాలు ఆ సంస్థను మాదకద్రవ్య వ్యాపారులు, దుష్టదేశాల కు పావుగా మార్చివేశాయని సెనెట్ నిగ్గుతేల్చింది. మనీ లాండరింగ్  ద్వారా ఈ బ్యాంకు మాదక ద్రవ్య వ్యాపారులకు, ఉగ్రవాదులకు నిధులందిస్తున్నట్లు సెనెట్  సబ్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది.
 
    హెచ్ ఎస్ బిసి మెక్సికో హెచ్ ఎస్ ఎంఎక్స్  మాదక ద్రవ్యాలు, హింసాకాండ, మనీ లాండరింగ్ లకు అడ్డాగా ఉన్న దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపింది. ఇరాన్, మయన్మార్, ఉత్తర కొరియా, తదితర దేశాలతో ఆర్థిక లావాదేవీలను నిషేధించే అమెరికన్  చట్టాలను హెచ్ ఎస్ బిసి తరచూ ఉల్లంఘించిందని వెల్లడించింది. 
             
      ఇక నల్ల డబ్బును తెల్ల డబ్బుగా ఎలా చలామణి చేసేందుకు మరో విధానం ఏమిటంటే.. మనీల్యాండరర్ ఏ కాసినోకో లేదా గుర్రాల రేసుకు వెళతాడు. అక్కడ తను అక్రమంగా సంపాదించిన నల్లధనంతో కాయిన్స్ కొనుగోలు చేసి ఆడతాడు. ఆట పూర్తయ్యాక ఆ మనీ ల్యాండరర్ చేతిలో చెక్కు తీసుకుని బయటపడతాడు. ఈ చెక్కును బ్యాంకులో చెలామణి చేసుకుంటాడు. తాను గ్యాంబ్లింగ్ లో గెలిచిన సొమ్ము అని ధైర్యంగా చెప్పి బ్యాంకులో డబ్బు జమ చేసుకుని బయటపడతాడు.
 
   కొన్ని కేసినోలు, అక్రమంగా డబ్బు సంపాదించిన మనీ ల్యాండరర్ లు ఒకరికొకరు సహాయపడుకుంటూ ఈ అక్రమదందాను జరుపుకుంటున్నారు. కంపెనీల్లో కూడా బ్లాక్ సాలరీస్ చలామణి అవుతోంది. కంపెనీలు ఉద్యోగులతో ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు .అవి బోగస్ కంపెనీలు కూడా కావచ్చు. నెలాఖరు నాటికి ఉద్యోగుల నగదు రూపంలో జీతాలు చెల్లిస్తారు. వీటికి తమ వద్ద ఉన్న నల్లధనం వినియోగిస్తారు.
         
     మనీ లాండరింగ్ దేశాన్నే కాదు ప్రపంచ ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐఎమ్ఎఫ్ లెక్కల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనీ ల్యాండరింగ్ వాటా రెండు నుంచి ఐదు శాతం వరకు ఉంటుందని అంచనా. దీని విలువ 67లక్షల కోట్లపైమాటే. ముఖ్యంగా బ్యాంకుల్లో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కెవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరో పక్క భారత్ ఫెరా,మనీ లాండరింగ్ నిరోధక చట్టం లాంటిని రూపోందించింది.
                 
     మనీలాండరింగ్ తో  వల్ల ఆర్థిక సంస్థలకు మాత్రమే కాదు, దేశానికి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. ఇది రోజు రోజుకూ మరింత ఆధునికతను సంతరించుకుంటూ మత్తుమందుల రవాణా నుంచి, ఆర్థిక ఉగ్రవాదం వరకు విస్తరించింది. చాలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ మనీలాండరింగ్ కు తగిన పరిష్కారాలను కనుగొని సమర్థవంతంగా అమలు జరుపుతున్నాయి. అయితే భారత్ లో మనీలాండరింగ్ వ్యాపారంలో, బిల్డర్లు, రాజకీయ నేతలు, ఎన్నికల ఫైనాన్స్ కు మధ్య క్విడ్ ప్రొకొ అనేది ముఖ్యమైన భాగమై పోయంది.
 
    మనీ లాండరింగ్ విధానంలో నిధులు ఎక్కడినుంచి వచ్చాయనేది తెలుసుకోవడం అసాధ్యం. దీంతో అక్రమంగా సంపాదించిన నల్లధనం, తెల్లధనంగా మారిపోతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా జరిగే మనీ లాండరింగ్ విలువ 1.5ట్రిలియన్ డాలర్లు! అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనీ ల్యాండరింగ్  వాటా రెండు నుంచి ఐదు శాతం వరకు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం 67లక్షల కోట్లపైమాటే. ముఖ్యంగా బ్యాంకుల్లో ఇలాంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాపై సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టులు దాడుల చేసిన తర్వాత యాంటీ మనీ ల్యాండరింగ్  గైడ్ లైన్స్ కు శ్రీకారం చుట్టింది.
 
    దీంతో ప్రపంచవ్యాప్తంగా కెవైసీని అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆర్థిక సంస్థలు కానీ, బ్యాంకు కానీ, ఖాతా తెరిచేటప్పుడు ఖాతాదారు పేరు, గుర్తింపు ఖచ్చితంగా తీసుకోవాలి. ఖాతాదారు అక్రమ ట్రాన్సాక్షన్ పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే వాటిని గుర్తించడం వీటన్నిటిని కలుపుకుని కెవైసీ అంటారు. దీని ప్రకారం కస్టమర్ గుర్తింపు, ఆయన చేసే వ్యాపార లావాదేవీలు తెలిసిపోతాయి. 
                   
     ఇక భారత్ విషయానికి వస్తే విదేశీ మారక ద్రవ్యం, కరెన్సీ ఎగుమతి దిగుమతులపై పరోక్ష ప్రభావం చూపే సెక్యూరిటీలు, లావాదేవీలను నియంత్రించేందుకు వీలుగా ఫారెన్ ఎక్చేంజ్ రెగ్యులేషన్ చట్టం, 1973.. ఫెరాను అమల్లోకి తెచ్చింది. అంతేకాకుండా 2004లో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియాను ఏర్పాటు చేసింది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని స్వీకరించడం, విశే్లషించడం, అందరికి పంపిణీ చేయడం ఈ సంస్థ ప్రధాన విధులు. ఇదే సమయంలో ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయంగా పనిచేస్తుంది. దీనికి ఆర్థిక మంత్రి నేతృత్వం వహిస్తారు.
 
    అయితే దేశంలో మనీ లాండరింగ్ ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ బిల్లు, 2011ను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభలో 2011 డిసెంబర్ లో ప్రవేశపెట్టారు. భారత్ లోని చట్టాలను, విదేశాల్లోని చట్టాలకు అనుసంధానించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంకు కెవైసికి సంబంధించిన మార్గదర్శకాలను బ్యాంకులకు 2002లో పంపింది. కెవైసి మార్గదర్శకాల ముఖ్యోద్దేశమేమంటే, నేరస్తులు మనీ లాండరింగ్ లేదా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే కార్యకలాపాలకు బ్యాంకులను ఉపయోగించుకోకుండా చూడటం.
 
     ఏది ఏమైనా మనీ లాండరింగ్ లేదా అక్రమంగా సంపాదించిన సొమ్ము మన భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా పరిణమించింది. సమాంతర ఆర్థిక వ్యవస్థగా తయారైంది.కనీసం భవిష్యత్ లో దేశం నుంచి నల్లడబ్బు తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత చేపట్టాలి. దొంగనోట్ల బెడదను సమర్ధవంతంగా నిరోధించాలి. ముఖ్యంగా వైట్ కాలర్ నేరాల అదుపుకు సమర్ధయంత్రాంగాన్ని రూపుదిద్దినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠంగా అమలుకాగలుగుతుంది. కేవలం చట్టం చేసినంత మాత్రాన ఈ మనీ లాండరింగ్ అరికట్టడం కేవలం భ్రమ మాత్రమే.
 
    వ్యవస్థను మరింత బలోపేతం చేయడమొక్కటే పరిష్కార మార్గం. చివరగా ఒక్క మాట ఒక వ్యక్తి చనిపోతే ఒక కుటుంబం కష్టాల్లో పడుతుంది. అదే ఒక ఆర్థిక నేరం ఒక వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది. కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోతాయి.
ఇండస్ట్రీ వర్గాల అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను పావుశాతం మేర తగ్గించింది. నిన్న ప్రకటించిన 2013 -14 వార్షిక విధానంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆర్ బీఐ వెల్లడించింది.
రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 5.5శాతంగా నమోదైన జీడీపీ, రెండో త్రైమాసికంలో 5.3శాతంగా నమోదైంది. కీలక రంగాల పనితీరులో ఆశాజనక మార్పు లేకపోవడంతో, జీడీపీ అనుకున్న స్థాయిలో రికవరీ సాధించలేదని నిపుణులన్నారు.
ఆర్ బిఐ కీలకరేట్ల పెంపు బ్యాంకింగ్ రంగానికి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. పెరిగిన వడ్డీరేట్ల కారణంగా నిర్దర్థక ఆస్తులు పెరిగిపోతాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..ఇప్పటికే తాజా త్రైమాసికంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లక్ష కోట్లకు చేరాయి.
అధిక వడ్డీరేట్లతో ఇబ్బందులు పడుతున్నవారికి శుభవార్త. జనవరి నుంచి ఆర్ బిఐ కఠిన ద్రవ్య విధానాన్ని సడలించనున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాల ఆధారంగా జనవరిలో కఠిన పరపతి విధానాన్ని సడలించే అవకాశముందని వెల్లడించింది.
ప్రస్తుత తరుణంలో వృద్ధి రేటు మరింత దిగజారితే తక్షణం స్పందిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో వృద్ధి రేటు తిరిగి గాడిలో పడుతుందని ఆర్ బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు.