Telangana: మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Postal Ballot Voting from May 3
x

Telangana: మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Highlights

Telangana: శరవేగంగా సన్నాహాలు చేస్తున్న ఎలక్షన్ కమిషన్

Telangana: తెలంగాణలో ఎన్నికల హీట్ కాకరేపుతోంది. ఎన్నికలకు 30 రోజులు కూడా సమయం లేకపోవడంతో పార్టీలు ప్రచారాల హోరు పెంచాయి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా వర్క్ స్పీడ్ పెంచింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పని చేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచిస్తోంది.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. సాధారణ పోలింగ్‌ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. ఏ జిల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆ జిల్లాల్లోనే ముద్రించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. 85 సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 4.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దివ్యాంగ ఓటర్లు సుమారు 5 లక్షల మంది నమోదయ్యారు. ఎన్నికల విధుల్లో సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు.

రాష్ట్రానికి చెందిన 15 వేల మందికిపైగా సిబ్బంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ పంపుతారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దివ్యాంగులు, వయోవృద్ధులు 12డీ దరఖాస్తు ఫారం నింపి రిటర్నింగ్‌ అధికారికి అందించాల్సి ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కావాల్సినవారు స్థానిక ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించి 12 డి దరఖాస్తు నింపి.. బ్యాలెట్ ను పొందవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories