నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. ఆ చీకటి రాత్రిలో అసలేం జరిగింది?

నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. ఆ చీకటి రాత్రిలో అసలేం జరిగింది?
x
నిర్భయ ఘటనకు ఏడేళ్లు
Highlights

గడ్డ కట్టించే చలి. అర్ధరాత్రి జరిగిన దారుణ ఉదంతం. ఆ నిశీరాత్రిలో నిర్భయ జీవితం తెల్లారిపోయింది. ఆరుగురు కీచకులు బస్సులోనే ఆ యువతిపై సామూహిక...

గడ్డ కట్టించే చలి. అర్ధరాత్రి జరిగిన దారుణ ఉదంతం. ఆ నిశీరాత్రిలో నిర్భయ జీవితం తెల్లారిపోయింది. ఆరుగురు కీచకులు బస్సులోనే ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత అత్యంత పాశవికంగా, హృదయవిదారకంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈ అనూహ్య ఘటనపై ప్రపంచం ఉలిక్కిపడింది. దేశం భగ్గుమన్నది. అక్కడా ఇక్కడా తేడా లేకుండా ఆ మూల ఈ మూలా బేధం లేకుండా అంతటా అందరూ ఏకమయ్యారు. కేంద్రాన్ని కదిలించారు. నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నారు. నిర్భయ ఘటన జరిగి నేటికి ఏడేళ్లయినా నిందితులకు మాత్రం శిక్షను ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. ఆ చీకటి రాత్రిలో అసలేం జరిగింది?

2012, డిసెంబర్ 16 - అర్థరాత్రి 12 గంటలు దాటాక - దేశ రాజధాని ఢిల్లీలో పాశవిక చర్య - నిర్భయపై మానవమృగాల లైంగిక దాడి.

ఆ నాటి ఘటన ఇంకా కళ్లముందే తిరుగుతూ ఉంది. దేశమంతా ఆమెకు జరిగిన అన్యాయంపై గళమెత్తింది. నిందితులకు శిక్షపడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెంటనే నిర్భయ చట్టాన్ని తెచ్చింది. నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. కానీ ఏడేళ్లు గడిచినా నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. షాద్‌నగర్‌లో దిశపై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌తో నిర్భయ నిందితుల ఉరి మరోసారి తెరపైకి వచ్చింది.

భారతదేశ చరిత్రలో, రాక్షసులు సైతం సిగ్గుపడే రోజు ఏదైనా ఉందంటే, అది డిసెంబర్ 16, 2012. దేశరాజధాని ఢిల్లీలో దారుణం. పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయపై, ఆరుగురు దుర్మార్గుల దురాగతం. అత్యంత పాశవికంగా నరరూప రాక్షసులు, యువతిపై మానవభంగానికి పాల్పడిన రోజది. నిస్సహాయులైన బాధితురాలు నగ్నంగా ఉన్నస్థితిలో తీవ్రంగా రక్తస్రావం అవుతుండగా, ఎముకలు కొరికే చలి రాత్రిలో, కదులుతున్న బస్సులో నుంచి బయటకు విసిరేసిన ఘోరమది.

ఆమె పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేశారు. జననాంగంలో పదే పదే ఇనుపచువ్వలు పెట్టడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైంది. చికిత్స పొందుతూ నిర్భయ తుదిశ్వాస విడిచింది. రాక్షసులతో పోరాడి పోరాడి మగువల తెగువేంటో నిరూపించింది. దేశ రాజధానిలో జరిగిన ఇంతటి ఘోరాతి ఘోర ఘటన ప్రపంచాన్ని మెలిపెట్టి పిండేసింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కోర్టు నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన మైనర్ బాలుడికి మూడేళ్ల శిక్ష విధించడంతో అది పూర్తి అయిపోయింది కూడా. కానీ ఇన్ని రోజులు గడిచినా నిర్భయ నిందితుల్లో మిగిలిన వారికి ఇంకా ఉరి శిక్ష అమలు కాలేదు. ప్రతి ఏటా నిర్భయ తల్లిదండ్రులు న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రోజూ కూతురును తలుచుకొని రోదిస్తునే ఉన్నారు. నిర్భయ తల్లిదండ్రులు కూడా నిందితుల ఉరిపై ఇంకా జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

దేశ నలుమూలలా ఆందోళనలు ర్యాలీలు ఒక ఎత్తయితే ఢిల్లీ వేదికగా సాగిన నిర్బయ పోరాటం, మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గనిర్దేశం చేసింది. న్యాయం కావాలన్న రణన్నినాదం పాలకుల చెవుల్లో గింగిరాలు తిప్పింది. వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో వచ్చిన యువతీయువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించిన ఘటన ఇదే. నిర్భయ నిరసనల ముందు మోకరల్లిన నాటి యూపీఏ ప్రభుత్వం, నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలుండేలా దాన్ని రూపొందిచింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన, నిర్భయ కేసులో ఎప్పుడేం జరిగింది ఫాస్ట్‌ కోర్ట్ నుంచి నేటి సుప్రీం కోర్టు దాకా ఎలాంటి తీర్పులు వెలువడ్డాయి. నిర్భయ కేసు టైమ్‌లైన్‌ ఒక్కసారి చూద్దాం.

డిసెంబర్ 16, 2012

23 ఏళ్ల పారామెడికల్‌

విద్యార్థినిపై ఆరుగురి అత్యాచారం

జనవరి 28, 2013

ఆరో నిందితుడిని మైనర్‌గా

విచారించాలని జువైనల్‌ బోర్డు ఆదేశం

మార్చి 11, 2013

ప్రధాన నిందితుడు రామ్‌సింగ్

తీహార్‌ జైల్లో ఆత్మహత్య

ఆగస్టు, 2013

మైనర్‌ను మూడేళ్లు

రిఫార్మ్‌ హోంలో వేయాలని ఆదేశం

సెప్టెంబర్ 13, 2013

నలుగురు నిందితులకు

ఉరిశిక్ష విధించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు

మార్చి 13, 2014

ఉరిశిక్షను సమర్థించిన

ఢిల్లీ హైకోర్టు

జూన్, 2014

హైకోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా

సుప్రీంలో ఇద్దరు దోషుల పిటిషన్

డిసెంబర్ 13, 2015

మూడేళ్ల జైలు శిక్ష తర్వాత

రిఫార్మ్ హోం నుంచి మైనర్‌ విడుదల

ఆగస్టు, 2016

దోషి వినయ్‌ శర్మ

ఆత్మహత్యాయత్నం

మే 5, 2017

నలుగురి ఉరిశిక్షను

సమర్థించిన సుప్రీం కోర్టు

మే 5, 2017

ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ

ముగ్గురి దోషుల రివ్యూ పిటిషన్

జులై 9, 2018

ఉరిశిక్షను సమర్థిస్తూ

సుప్రీం కోర్టు తీర్పు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రజలంతా నిర్భయ దోషులపై చర్చించుకుంటున్నారు. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories