ఏ పార్టీలపై మోడీ అస్త్రం వదిలారు?

ఏ పార్టీలపై మోడీ అస్త్రం వదిలారు?
x
Highlights

కేవలం నోటానే కాదు, కోటాకు కారణం. టెన్‌ పర్సెంట్‌ రిజర్వేషన్‌తో అనేక పార్టీలపై తూటా వదిలారు మోడీ. లోక్‌సభ ఎన్నికల తరుణంలో సరికొత్త అస్త్రంగా సంధించారు. మోడీ మదిలో దాగిన మరిన్ని వ్యూహాలేంటి?

కేవలం నోటానే కాదు, కోటాకు కారణం. టెన్‌ పర్సెంట్‌ రిజర్వేషన్‌తో అనేక పార్టీలపై తూటా వదిలారు మోడీ. లోక్‌సభ ఎన్నికల తరుణంలో సరికొత్త అస్త్రంగా సంధించారు. మోడీ మదిలో దాగిన మరిన్ని వ్యూహాలేంటి?

బీజేపీకి ఆక్సిజన్‌ ఇచ్చిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 70కి పైగా స్థానాలు కొల్లగొట్టి హస్తినలో పీఠం దక్కించుకుంది. అయితే, ఇప్పుడక్కడ పరిస్థితులు మారాయి. అక్కడ బైపోల్స్‌లోనూ బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఎస్పీ, బీఎస్పీ జట్టుకడుతున్నాయి. కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గతంలో ఎస్పీ-బీఎస్పీ-కాంగ్రెస్‌లు మహాఘట్‌బంధన్‌గా ఏర్పడి పోటీ చేసినప్పుడు, ఉన్నతకులాలు బీజేపీకి మద్దతిచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ సింగిల్‌గా పోటీ చేస్తుండటంతో, అగ్రవర్ణాల ఓట్లు సంప్రదాయంగా కాంగ్రెస్‌కు దక్కే ఛాన్సుంది. అంటే ఉన్నతవర్గం ప్రజల ఓట్లు, బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య చీలిపోతాయి. ఇదే జరిగితే బీజేపీ చాలా సీట్లు కోల్పోవడం ఖాయం. ఢిల్లీలో కమలానికి అధికారం చేజారే ప్రమాదం. అందుకే ఉన్నతకులాలు, తమవైపే ఉండేలా, పది శాతం కోటాస్త్రం వదిలారు నరేంద్ర మోడీ.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ టార్గెట్ కేవలం కాంగ్రెస్ ఒక్కటే కాదు, అంతకుమించి. ఎందుకంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి అద్బుతమైన వ్యూహం వేశారు. కేవలం దళితులే కాదు అగ్రవర్ణాలు సైతం తనవైపు చూసేలా స్ట్రాటజీ ప్లాన్ చేశారు. అదెంటంటే, అగ్రకులాల్లోని పేదలకు సైతం రిజర్వేషన్లు. ఉన్నతవర్గాల్లోనూ పేదలకు సైతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పర్‌ క్యాస్ట్‌ సైతం బీఎస్పీకి మద్దతు పలికారు. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని, మాయావతి తప్పుపట్టలేని పరిస్థితి. ఆమె కూడా మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. యూపీలో బీఎస్పీని సైతం ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అయ్యారు మోడీ.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై దేశమంతా చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో వాడివేడీగా కాంగ్రెస్ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. అనేక వేదికల మీద చర్చకుపెడుతోంది. బీజేపీ దీటుగా బదులివ్వడంలో, కీలకమైన ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో దాటవేత ధోరణి అనుసరిస్తోంది. రెండు, మూడు నెలల్లో ఎన్నికల రానున్న టైంలో, రాఫెల్‌పై మరక మరింతగా అంటుకుంటుందని మోడీ ఆలోచిస్తున్నారు. దీనిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు, కోటా వంటి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అందరి సంభాషణలు అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్‌పై మళ్లాయి. మోడీకి కావాల్సంది కూడా అదే. అందుకే కోటా బాట.

ఉత్తరాది అగ్రకులాలే బీజేపీకి ఓటు బ్యాంకు. కోటా నిర్ణయంతో ఆ ఓట్లు పదిలం. ఇక దక్షిణాదిలో బీజేపీకి బేస్ లేదు. అందుకే సౌత్‌లోనూ పటిష్టమైన పునాది వేసకునేందుకు, భవిష్యత్తులో మరింతగా ఎదిగేందుకు, ఈబీసీ రిజర్వేషన్ల వెపన్‌ వదిలారు నరేంద్ర మోడీ. బక్కచిక్కిన అగ్రకుల పేదలు, బీజేపీ వైపు చూసేలా చేసుకున్నారు. ఇలా నోటా పాఠం మొదలుకుని, అనేక వ్యూహాలతో అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్‌‌కు ‌శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ. మరోసారి కుల సమీకరణాలతో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని సమరవ్యూహం వేశారు. మరి మోడీ స్ట్రాటజీ వర్కౌట్‌ అవుతుందా, అగ్రకులాలన్నీ కమలం వైపు తిరుగుతాయా వీటికి సమాధానం కాలమే.

Show Full Article
Print Article
Next Story
More Stories