తెలంగాణలో కాసేపట్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 537 మండల పరిషత్లలో ఇవాళ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు...
తెలంగాణలో కాసేపట్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 537 మండల పరిషత్లలో ఇవాళ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఎన్నికలను చేపడతారు. మండల పరిషత్ కో-ఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల శిబిరాలకు తరలి వెళ్లిన ఎంపీటీసీలు.. ఎన్నికలను చేపట్టే సమావేశ మందిరాలకు నేరుగా హాజరు కానున్నారు.
ఉదయం 10 గంటలకు కో-ఆప్టెడ్ సభ్యుడి పదవి కోసం నామినేషన్లను స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ జరగనుంది. వెంటనే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఒక్కో మండల పరిషత్లోను కో-ఆప్టెడ్ సభ్యుడి పదవికి చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక చేపడతారు. కేవలం ఎంపీటీసీ సభ్యులకు తప్ప ఇంకెవరికీ ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక పూర్తయి విజేతను ప్రకటించాక.. మధ్యాహ్నం 3గంటలకు మండల పరిషత్ అధ్యక్ష పదవికి, ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహిస్తారు.
ఈనెల 4వ తేదీన విజేతలను ప్రకటించగానే.. ఆయా పార్టీలు అప్రమత్తమయ్యి తమ వారు చేజారిపోకుండా వివిధ మార్గాలను అనుసరించాయి. రెండు పార్టీలకు ఎంపీటీసీ సభ్యులు సమానంగానో.. కొంచెం అటుఇటుగానో ఉన్న చోట తమ వారిని నేతలు విహార యాత్ర పేరుతో శిబిరాలకు తరలించారు. ప్రత్యర్థులకు అసలు మాట్లాడే అవకాశం కూడా లేకుండా.. సెల్ఫోన్లను సైతం దూరంగా ఉంచారు. ఇరు పార్టీలకు సభ్యులు సమాన సంఖ్యలో ఉన్న చోట్ల స్వతంత్రులకు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. వీరికి విప్ అంటూ ఏదీ వర్తించదు కాబట్టి కొంతమంది రాత్రికి రాత్రే పార్టీల పంచన చేరారు. సంగారెడ్డి రూరల్ మండలంలో కాంగ్రెస్, తెరాసకు ఎంపీటీసీ సభ్యులు సమాన సంఖ్యలో గెలవగా.. అక్కడి స్వతంత్ర సభ్యుడిని కాంగ్రెస్ వారు తమవైపు తిప్పుకోగలిగారు. కొన్ని చోట్ల తెరాస రెబల్స్ స్వతంత్రులుగా పోటీచేసి గెలవటంతో వారు తిరిగి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసేలా జిల్లా నాయకత్వాలు పావులు కదుపుతున్నాయి.
సునాయాసంగా గెలిచే అవకాశాలున్నా అక్కడక్కడా తలనొప్పులు..
మండల పరిషత్ పదవులను సునాయాసంగా గెలుచుకొనే అవకాశాలున్నా పార్టీలకు కొన్ని చోట్ల తలనొప్పులు ఎదురవుతున్నాయి. విజేతల్లో.. ఆయా రిజర్వేషన్లు అనుకూలించిన వారు ఎక్కువగా ఉండటంతో వారిలో పోటీ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో తెరాసకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ అదే పార్టీకి చెందిన నలుగురు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. పలు చోట్ల ఇదేపరిస్థితి ఉంది. ఇటువంటి ఆశావహుల నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఎవరికనేది పార్టీ నాయకులు శుక్రవారం తెలియజేసి.. విప్ జారీ చేసినట్టుగా ప్రకటిస్తారు. దీంతో పదవులను ఆశించి భంగపడినా.. వారంతా పార్టీచెప్పిన అభ్యర్థికి అనుకూలంగా చేతులను ఎత్తక తప్పదు. మండలాల్లో చక్రం తిప్పాలని కలలుకని.. రిజర్వేషన్లు అనుకూలించక డీలా పడ్డవారు ఉపాధ్యక్ష పదవులను చేపట్టాలని భావిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల ఉపాధ్యక్ష పదవులకూ పోటీ ఏర్పడింది. కొన్ని మండలాలు చిన్నవిగా ఉండటంతో అక్కడి ఎన్నికలాంఛనంగానే ఉండనుంది. సంగారెడ్డిజిల్లా అమీన్పూర్ మండలంలో ముగ్గురే ఎంపీటీసీ సభ్యులు ఉండగా వారిలో ఇద్దరు అధికార పార్టీకి, ఒకరు కాంగ్రెస్కు చెందినవారు. దీంతో అధికారపార్టీకి చెందిన ఒకరు అధ్యక్షులుగాను, మరొకరు ఉపాధ్యక్షులుగాను ఎన్నికవుతారు.
జడ్పీ ఎన్నికల్లోనూ మండల పరిషత్ విధానమే...
మండల పరిషత్ ఎన్నికల విధానాన్నే శనివారం చేపట్టే జడ్పీ ఎన్నికల్లోను అనుసరిస్తారు. ప్రతి జడ్పీలోను తొలుత ఇద్దరేసి కో-ఆప్టెడ్ సభ్యులకు ఎన్నికలను నిర్వహించి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలను నిర్వహిస్తారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire