హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ట్విన్ సిటీస్ లో(హైదరాబాద్, సికింద్రాబాద్) నిర్వహించే అతి పెద్దపండగా బోనాలు. తెలంగాణ...
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ట్విన్ సిటీస్ లో(హైదరాబాద్, సికింద్రాబాద్) నిర్వహించే అతి పెద్దపండగా బోనాలు. తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. తెలంగాణ గొప్ప వారసత్వానికి, సంస్కృతికి నిదర్శనం.
బోనాల సందర్భంగా భక్తులు మహంకాళి వివిధ రూపాలైన.. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ, డొక్కాలమ్మ, పోలేరమ్మ, నూకలమ్మ, మారెమ్మలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.
చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన గోల్కొండ కోటలోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభవుతాయి. అనంతరం నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో కొనసాగుతాయి. పోతురాజు(అమ్మవారి సోదరుడు) నేతృత్వంలో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభంగా కొనసాగుతాయి. ఓల్డ్ సిటీలో డప్పులు, వాయిద్యాల మధ్య వందలాదిమంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. తొట్టేళ్లు, డమరుక శబ్దాల మధ్య, వివిధ అలంకరణల్లో చేసే నృత్యాలు ఎంతో అలరిస్తాయి.
బోనాలు మొదటి, ఆఖరి రోజు ఎల్లమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజల నిర్వహిస్తారు. తమ కోరికలను నెరవేర్చినందుకు కృతజ్ఞతగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
బోనాలు ప్రాశస్త్యం....
బోనాలు అనే పదం భోజనాలు అనే తెలుగు పదం నుంచి వచ్చింది. కరువు కాటకాల నుంచి రక్షించి, రోగాలు, ఇతర విపత్తుల నుంచి రక్షించమని భక్తులు ఎంతో ప్రేమతో దేవతకు బోనాలు సమర్పిస్తారు. మహిళలు ప్రత్యేకంగా మట్టికుండలో బెల్లం, పాలతో పొంగళి వండి.. వేప ఆకులు, పసుపు, కుంకుమలతో అలంకరించి అమ్మవారి వద్దకు తీసుకొస్తారు. ఈ కుండను గాలీ, నీరు, భూమి, అగ్ని, వాయువు పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. బోనంతో పాటు అమ్మవారికి చీర, కుంకుమ, గాజులను సమర్పిస్తారు.
ముఖ్యంగా 1813 లో సికింద్రాబాద్ లో ప్లేగు వ్యాధి కొన్ని వేలమందిని బలితీసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మిలటరీ దళాలు ఉజ్జయిన్ మోహరించాయి. అలాగే ఇక్కడి ప్రజలను కబళించి వేస్తున్న అంటువ్యాధి గురించి తెలుసుకున్నాయి. ఈ వ్యాధి నుంచి ప్రజలను రక్షించాల్సిందిగా ఉజ్జయిని అమ్మవారిని వేడుకొన్నారు. ప్లేగు వ్యాధిని పారద్రోళితే సికింద్రాబాద్ లో అమ్మవారికి గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. తర్వాత ప్లేగు వ్యాధి అదుపులోకి రావడంతో..ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారికి గుడిని నిర్మించారు. ప్లేగు వ్యాధి నుంచి రక్షించినందుకు గుర్తుగా అప్పటి నుంచి మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
అనంతరం ట్విన్ సిటీస్ లోని వివిధ రూపాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. తెలంగాణలోని రెండు ముఖ్యమైన బోనాలు, బతుకమ్మ పండుగలు మహిళలకు సంబంధించినవే కావడం. మహిళా శక్తి గుర్తుగా ఈ పండగలు నిర్వహిస్తారు.
పండగా ఎలా నిర్వహిస్తారు?
గోల్కండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో.. ఆషాడ మాసం మొదటి ఆదివారం పూజా కార్యక్రమాలతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రెండు వారాలపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. రెండో ఆదివారం బల్కమ్ పేటలోని ఎల్లమ్మతల్లి ఆలయం, ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడో ఆదివారం చిలకలగూడలోని కట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో నిర్వహిస్తారు.
ప్రధానమైన బోనాలు ఉత్సవాలను ఆగస్టు 5వ తేదీ నిర్వహిస్తారు. మహంకాళి జాతర, ఊరేగింపు ఆగస్టు 6న అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత బోనాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించింది. బతుకమ్మతో పాటు బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించింది.
ఈ ఏడాది ఉజ్జయిని మహంకాళికి రూ.కోటి విలువ చేసే బంగారు బోనం ను ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు. అలాగే బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రూ.15కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire