ఎన్నికల ప్రచారంలో నేతలు కట్టు తప్పుతున్నారు. ప్రధాని మోడీయే పదే పదే ఎన్నికల కోడ్ దాటేస్తున్నారు.. సర్జికల్ దాడులను, బాలాకోట్ దాడులను కూడా ప్రచారానికి...
ఎన్నికల ప్రచారంలో నేతలు కట్టు తప్పుతున్నారు. ప్రధాని మోడీయే పదే పదే ఎన్నికల కోడ్ దాటేస్తున్నారు.. సర్జికల్ దాడులను, బాలాకోట్ దాడులను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు. దేశభక్తి కలిగిన ప్రతీ పౌరుడు కమలానికి ఓటేసి బాలాకోట్ దాడులకు మద్దతు పలకాలన్నారు మోడీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ పుల్వామా అమర వీరులకు నివాళి ఘటించాలని పిలుపునిచ్చారు. అందుకు బీజేపీకి ఓటేయడమే మార్గమని తేల్చారు. ఇలా ఎన్నికల ప్రసంగాలన్నింటినీ దేశ భక్తికి లింకు పెట్టి ప్రధాని మాట్లాడుతున్నారు. బీజేపీకి మాత్రమే దేశం పట్ల చిత్త శుద్ధి ఉందన్న బిల్డప్ ఇస్తున్నారు ప్రతీసారి సరిహద్దుల ఉద్రిక్తతను ప్రచారానికి పావుగా వాడేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ మోడీ మాట్లాడిన ప్రతీచోటా ప్రతీ మాటా ఇదే ఓటర్లలో ఓ రకమైన దేశ భక్తి భావాన్ని రెచ్చగొట్టి దాన్ని తమ పార్టీకి అనుకూల ఓటుగా మార్చుకునే ప్రయత్నమే ఆయనలో కనిపిస్తోంది.
మహారాష్ట్రలోని లాతూర్ ఎన్నికల సభలో మోడీ తొలిసారి ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. బాలాకోట్ దాడులు జరిపిన సైన్యానికి మద్దతుగా, పుల్వామా దాడుల్లో మరణించిన సిపాయిలకు నివాళిగా బీజేపీకి ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. ఆ తర్వాత కర్ణాటక ప్రచారంలోనూ అదే తీరు.మోడీ మాటలపై వామపక్షాలు గగ్గోలు పెట్టాయి. మోడీ తీరు అలా ఉంటే యూపీ సీఎం యోగీ మరింత చెలరేగారు. మీరట్ ర్యాలీలో ఇండియన్ ఆర్మీకి ఏకంగా మోడీ సేన అని కితాబిచ్చేశారు.ఎస్పీ బీఎస్పీ కూటమిల మైనారిటీ ఓటు బ్యాంకునుద్దేశించి వారికి ఆలీ ఓట్లపై విశ్వాసముంటే తమకు భజరంగ్ బలి పై విశ్వాసముందన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండా రంగును గ్రీన్ వైరస్ తో పోల్చారు. దాంతో యోగీకి ఈసీ నోటీసు లిచ్చింది. మహారాష్ట్రలో భాభీజీ ఘర్ పర్ హై పేరుతో మోడీ పథకాలపై జీ ఎంటర్ టైన్ మెంట్ గ్రూప్ ఛానెళ్లలో ఓ సీరియల్ ప్రసారమవుతోంది. దీంట్లో మోడీ పథకాలన్నింటిని హృద్యంగా తెరకెక్కించారు. ఈ సీరియల్ టీఆర్పీలు కూడా అమాంతం పెరుగుతున్నాయి.దీనిపైనా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఇక నమో టీవీ ప్రసారాలయితే పెద్ద మిస్టరీయే అని చెప్పాలి. వాటినికూడా ఆపాలని ఈసీ ఆదేశాలిచ్చినా బీజేపీ లెక్క చేయడం లేదు. అంతేకాదు దేశానికి తానే చౌకీదారునని చెప్పే మోడీ రాఫెల్ పై వస్తున్న ఆరోపణలకు మాత్రం జవాబివ్వడం లేదు. చివరకు యాంటీ శాటిలైట్ మిసైళ్ల టెస్ట్ ను కూడా మోడీ ప్రచారానికే వాడుకున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తే యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఇక ఇతర నేతలు ఊరుకుంటారా? కేంద్రమంత్రి మేనకా గాంధీ ఓట్లేయకపోతే పనులు చేయనంటూ ముస్లింలను బెదిరించారు.
ఇక బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సైతం తానేం తక్కువ తినలేదని నిరూపించారు. తానొక సన్యాసినని అందరూ తనకు ఓటేయకపోతే తన శాపం తగులుతుందనీ హెచ్చరించారు. ఇలా బీజేపీ పెద్దలంతా ఇంత చేటున ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేస్తున్నారు. ఈసీ ఆదేశాలను కనీసం పట్టించుకోవడం లేదు ప్రధాని స్థాయి వ్యక్తే ఈసీ ఆదేశాలకు విలువ ఇవ్వకపోతే కింది స్థాయి నేతలు పాటిస్తారా? మోడీ ప్రదర్శిస్తున్న లెక్కలేని తనం ఓటమి భయంతోనా? లేక గెలుపుపై అతి విశ్వాసమా? లేక ప్రధాని పదవి ఆయనలో పెంచిన దర్పమా?
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire