బెయిల్‌పై విడుదలైన స్వాతి

బెయిల్‌పై విడుదలైన స్వాతి
x
Highlights

ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూల్ స్వాతి బెయిల్‌పై విడుదలయ్యింది. 8 నెలల తర్వాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.....

ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూల్ స్వాతి బెయిల్‌పై విడుదలయ్యింది. 8 నెలల తర్వాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. మహబూబ్‌నగర్ జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఆమెను తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో.. ఆమెను స్టేట్ హోంకు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈనెల 16నే ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) అవసరం ఉండగా.. ఎవరూ ముందుకు రాక ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది.

కాగా, బుధ వారం నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వగా శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు, కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆమెను సాయంత్రం జైలు నుంచి విడుదల చేశారు. అయితే స్వాతిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు, బంధువులెవరూ జైలు దగ్గరకు రాలేదు. ఈ నేపథ్యంలో స్వాతి, ముందుగానే కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆశ్రయం కల్పించాలని లేఖ రాశారు. దీంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని నేరుగా జిల్లా కేంద్రంలోని రాష్ట్ర సదనానికి తరలించారు.

కొత్తకోట మండలం అజ్జకోలు గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డితో స్వాతికి వివాహంకాగా ఇద్దరు పిల్లలు. ఆమె రాజేష్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ప్రియుడి మోజులో పడి గతేడాది నవంబర్‌లో సుధాకర్‌రెడ్డిని హతమార్చేందుకు స్కెచ్ వేసింది. ప్రియుడు రాజేష్‌తో కలిసి నాగర్‌కర్నూల్‌లోని తన ఇంట్లోనే సుధాకర్‌రెడ్డిపై దాడి చేసి చంపేశారు. డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి నవాబుపేట సమీపంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తర్వాత రాజేష్ మొహంపై యాసిడ్‌ పోసి.. అతడే సుధాకర్‌రెడ్డిగా నమ్మించే ప్రయత్నం చేశారు.

రాజేష్‌నే సుధాకర్ రెడ్డిగా భావించి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని స్వాతి భావించింది. సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు కూడా మొహానికి బ్యాండేజ్‌లు ఉండటంతో అతడ్ని గుర్తించలేకపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న రాజేష్ తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు సుధాకర్‌రెడ్డి పేరిట చికిత్స పొందుతున్న రాజేష్‌ వేలిముద్రలు సేకరించడంతో గుట్టురట్టయింది. ఈ హత్య వ్యవహారం మొత్తం బయటపడింది. స్వాతితో పాటూ ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలలుగా ఇద్దరు మహబూబ్‌నగర్ జైల్లో ఉండగా.. స్వాతికి బెయిల్ మంజూరయ్యింది. ఈ కేసులో మరో నిందితుడు రాజేశ్‌కు ఇంకా బెయిల్‌ లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories