విద్యార్థులకూ రక్షణలేదు!

విద్యార్థులకూ రక్షణలేదు!
x
Highlights

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో విద్యను అందిస్తామని చెప్పి...విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజే ఇంటర్నేషనల్ స్కూళ్లలో రక్షణ ఉండటం...

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో విద్యను అందిస్తామని చెప్పి...విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజే ఇంటర్నేషనల్ స్కూళ్లలో రక్షణ ఉండటం లేదని మరోసారి రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే గురుగ్రామ్‌లో ఓ దారుణం జరిగింది. నగరంలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న చిన్నారి బాలుడిని అత్యంత పాశవికంగా చంపేశారు. ఉదయం టాయ్‌లెట్‌కు వెళ్లిన విద్యార్థులకు రక్తపు మడుగులో ఓ బాలుడి మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలియజేశారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కత్తితో గొంతు కోసినట్లు నిర్థారించారు.. రోజులాగే తండ్రి ఉదయాన్నే ఆ చిన్నారిని స్కూల్ వద్ద దింపి ఇంటికి చేరుకోగానే ఒక వార్త వారి చెవిన పడింది. దీంతో తల్లిదండ్రులు పరుగు పరుగున స్కూల్ వద్దకు చేరుకుని షాకుకు గురయ్యారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే స్కూలు యాజమాన్యం అసలు విషయం దాచి మీ అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడని.. అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పినసమాచారం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఏడాది క్రితం ఇదే స్కూలుకు చెందిన వసంత్‌కుంజ్ బ్రాంచ్‌లో దివ్యాంశ్ అనే ఆరేళ్ల చిన్నారి వాటర్ రిజర్వాయర్లో పడి మరణించడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో విద్యార్థుల భద్రతకు అమలు చేస్తోన్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ యాజమాన్యాలను ఆదేశించింది. ఇంత జరిగినా సదరు పాఠశాలలు మొద్దునిద్ర వదలడం లేదు. స్కూలు యాజమాన్యాల నిర్లక్ష్యమే తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. అయితే ఈ బాలుడి హత్య వెనుక ‘లైంగిక వేధింపు అని తెలియగానే సభ్యసమాజం హతాశురాలైంది. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని గుర్గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలులో ఏడేళ్ల చిన్నారి బాబు టాయ్‌లెట్‌లో శవమై తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్నారి అని కనికరం కూడా లేకుండా కత్తితో అత్యంత పాశవికంగా బాలుడి గొంతు కోసి చంపడం అందరినీ కంటతడి పెట్టించింది.

పాఠశాలలో విద్యార్థుల మధ్య ఎటువంటి గొడవ జరిగిన దాఖలాలు లేవు..స్కూలు సిబ్బందిని ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్న సమాధానమే.. మరి హత్య ఎవరు చేసి ఉంటారు..ఇదే ఖాకీల మెదళ్లను తొలిచేసింది. దీంతో ఆ ప్రశ్నకు సమాధానాన్ని తమ కోణంలో వెతికారు. ఆ వెతుకులాటలో అసలు నేరస్థుడు ఇంటి దొంగే అని తేలింది. అతను ఎవరో కాదు ఆ స్కూల్లో గత ఎనిమిది నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తోన్న 42 ఏళ్ల అశోక్ కుమార్. అతను చిన్నారిని ఎందుకు హత్య చేశాడూ అంటే లైంగిక దాడిని ప్రతిఘటించాడని.. హత్యకు గురైన చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్‌ని వాళ్ల నాన్న స్కూలు వద్ద దించివెళ్లాడు. అప్పుడే బస్ పార్క్ చేసి వస్తున్న అశోకుకు బాలుడు టాయ్‌లెట్ వద్ద ఒంటరిగా కనిపించడంతో.. అతనిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు..బాలుడు తప్పించుకునేందుకు యత్నించడంతో చిన్నారిని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని.. కత్తితో రెండుసార్లు పొడిచానని, అనంతరం కత్తిని కడిగి ఘటనాస్థలంలో పడేసినట్లు నిందితుడు అశోక్ ఒప్పుకున్నాడు.

అయితే స్కూలు యాజమాన్యం ఏదో నిజాన్ని కప్పిపుచ్చేందుకే హత్య జరిగిన సంగతి చెప్పకుండా మీ అబ్బాయి ఆరోగ్యం సరిగాలేదని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పడం.. రక్తపు మరకల్ని మాయం చేసేందుకు యత్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందులో వాస్తవమెంతో దర్యాప్తు అధికారులకే తెలుస్తుంది... కానీ.. ఈ ఘటనతో సభ్యసమాజంలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయిందని తేటతెల్లమైంది. మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు చాప కింద నీరులా భారతీయ సమాజంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయకపోతే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నడిరోడ్డుపై నడవలేని పరిస్థితి రావడం ఖాయమని భవిష్యత్తు భయపెడుతోంది. ఇటువంటి పేరు గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫీజులపైనే కాకుండా విద్యార్థుల రక్షణపైన కూడా దృష్టి పెడితే ఇటువంటి దారుణాలు జరక్కుండా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పేరు గొప్పగా ప్రచారార్భాటాలతో నడిచే స్కూళ్లపై జాగ్రత్తగా పరిశీలించి చిన్నారులను చేర్పించడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories