చైనాలో సంచలనం..ఫోటోలో మాట్లాడుతున్న సత్యసాయి

Highlights

పుట్టపర్తి సత్యసాయి బాబా నిర్యాణం చెంది ఆరేళ్లవుతున్నా ఆయన పిలిస్తే పలుకుతున్నారని భక్తులు గాఢంగా విశ్వసిస్తున్నారు. సూక్ష్మరూపంలో బాబా తమ వెన్నంటే...

పుట్టపర్తి సత్యసాయి బాబా నిర్యాణం చెంది ఆరేళ్లవుతున్నా ఆయన పిలిస్తే పలుకుతున్నారని భక్తులు గాఢంగా విశ్వసిస్తున్నారు. సూక్ష్మరూపంలో బాబా తమ వెన్నంటే ఉన్నారనడానికి సాక్ష్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూపిస్తున్నారు. చైనాలో సత్యసాయి భక్త సమాజానికి బాబా ఫోటోలో నుంచి మాట్లాడుతూ దర్శనమిచ్చారు. ఆ వీడియో చూసిన భక్తులు, బాబా తన జయంతి సందర్భంగా ఇచ్చిన బహుమతని మురిసిపోతున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. జయంతి వేడకలు ప్రారంభమయ్యే ముందే సత్యసాయి భక్తులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. దీనికి కారణం బాబా ఫోటో నుంచి భక్తులతో మాట్లాడుతుండటమే.
దేశం కాని దేశం చైనాలో సత్యసాయి బాబా ఫోటో మాట్లాడుతూ కనిపించింది. ఫాంగ్ సూన్ నగరంలోని సత్యసాయి భజన మందిరంలో భక్తులు భజన చేస్తుండగా బాబా ఫోటో నుంచి భక్తులతో మాట్లాడారు.
ఫోటోలో బాబా పెదవులు విడివడి, మూసుకుని మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. భక్తులు మైమరచిపోయి బాబాతో మాట్లాడారు. ఫోటో నుంచి మాటలు వినిపించకపోయినా ఈ అద్భుతాన్ని చూసిన భక్తులు మాత్రం బాబా తమ ప్రార్థనలకి మెచ్చి ఈ విధంగా తమను అనుగ్రహించారని నమ్ముతున్నారు.
ఇప్పుడు ఇంటర్నెట్ లో ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్ లలో ఈ వీడియో వైరల్ గా మారింది. బాబా పార్థివ దేహాన్ని వీడి ఆరేళ్లవుతున్నా సూక్ష్మ శరీరంలో తిరుగుతూ తనను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారన్న సత్యం ఈ వీడియోతో స్పష్టమైందని వారంటున్నారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన స్వామి భక్తులు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటికి తన జయంతి సందర్భంగా బాబా ఇచ్చిన బహుమతి అని ఆనందంతో ఉప్పొంగుతున్నారు. పుట్టపర్తిలో బాబా మహాసమాధి దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక నేటి నుంచి వారం రోజుల పాటు జరిగే సత్యసాయి బాబా జయంతి వేడుకలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ప్రభుత్వం, ఇటు ట్రస్ట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుకలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్, ఉపరాష్ట్రపతి రానుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories