చరిత్ర సృష్టించనున్న రూ. 200నోటు

Highlights

చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్‌బీఐ శుభవార్త అందించింది. చిల్లర సమస్యలకు, నకిలీ కరెన్సీ నోట్లకు...

చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్‌బీఐ శుభవార్త అందించింది. చిల్లర సమస్యలకు, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త రూ.200 నోటు రేపే మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో వీటిని శుక్రవారం మార్కెట్‌లలోకి లాంచ్‌ చేయనున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ కరెన్సీ నోటు మార్కెట్‌లో ద్రవ్య సమస్యను, రూ.100 నోటుపై పడుతున్న భారాన్ని తగ్గించనుందని ఆర్‌బీఐ తెలిపింది. ''రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆగస్టు 25న రూ.200 డినామినేషన్‌ బ్యాంకు నోట్లను మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో మార్కెట్‌లోకి జారీచేస్తుంది. దీనిపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉంటుంది'' అని ఆర్‌బీఐ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ సాంస్కృతిక పౌరసత్వాన్ని ప్రతిబింబించేలానే ఈ నోట్లను ఆర్‌బీఐ తీసుకొస్తుంది. ఈ నోటు బేస్‌ కలర్‌ బ్రైట్‌ ఎల్లో.

చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్‌ బ్యాంకు నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఆగస్టు చివరి రోజుల్లో లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో ఈ కొత్త నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్టు నిన్ననే రిపోర్టులు వచ్చాయి. కానీ రిపోర్టుల కంటే కాస్త ముందస్తుగానే, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా పరమైన ఫీచర్లతో ఈ కొత్త రూ.200 నోటు వస్తోంది. రూ. 100, రూ. 500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటివరకూ లేదు. దీంతో రూ. 200 నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్‌బీఐ అంచనా. అంతేగాక.. రూ. 200నోట్లు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ అన్ని చర్యలు తీసుకుంటోంది. 200 రూపాయిల బ్యాంకు నోట్ల విడుదలకు ఇటు కేంద్రం కూడా నిన్ననే(బుధవారమే) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.200 నోట్లను ఆర్‌బీఐ జారీ చేయనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ నోట్ల విడుదలకు ఆమోదం తెలిపిన రెండు రోజుల్లోనే వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories