సమయం లేదు మిత్రమా..

సమయం లేదు మిత్రమా..
x
Highlights

ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. నామినేషన్లు...

ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. నామినేషన్లు వేసేందుకు వారం రోజులే సమయం ఉండటం, ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉండటం పార్టీలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది.

ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో పార్టీల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ వెంటాడుతోంది. పోలింగ్‌కు నెలరోజుల సమయమే ఉండటంతో ఆందోళన మొదలైంది. ఈ నెలరోజుల్లోనే అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో పూర్తి చేయాల్సి ఉండటం ఒత్తిడి పెంచుతోంది. నామినేషన్లు వేసేందుకు కూడా వారం సమయం మాత్రమే ఉండటం, ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉండటం పార్టీలను కలవరపెడుతోంది. అంతేకాదు పోలింగ్ పూర్తయిన 42 రోజుల తర్వాత మే 23 న ఫలితాలు వెల్లడికానున్నాయి.

పార్టీలు అభ్యర్థుల ఎంపికను ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి తెస్తున్నాయి. మేనిఫెస్టోను కూడా రూపొందించే పనిలో ఉన్నాయి. ఈలోపే షెడ్యూల్ రావడం పార్టీలకు కాస్త ఇబ్బందిగా మారింది. ఈనెల 18న నోటిఫికేషన్ రావడం ఈనెల 25తో నామినేషన్లు వేసేందుకు సమయం ముగుస్తుండటం పార్టీలను పరుగులు పెట్టిస్తోంది. అంటే 15రోజుల్లోనే అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక మేనిఫెస్టోను కూడా వీలైనంత త్వరగా ప్రకటించి, ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయాలి ఇలా ఒకదాని తర్వాత మరొకటి వచ్చి పడటం పార్టీలపై ఒత్తిడి పెంచుతోంది.

షెడ్యూల్‌కు ముందే పార్టీలు ఎన్నికలపై దృష్టిపెట్టాయి. పార్టీలవారీగా గమనిస్తే టీడీపీ ఎన్నికల సమరంలో కాస్త దూకుడుగానే ఉంది నెల రోజులుగా అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. తొలిజాబితాలో 115 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అలాగే, మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేసిన చంద్రబాబు మేనిఫెస్టో విడుదలకు కసరత్తు చేస్తున్నారు.

ఇక వైసీపీ కూడా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను కొలిక్కి తెచ్చి మొదటి జాబితాను విడుదల చేసే పనిలో నిమగ్నమైంది. ఇక మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేసిన వైసీపీ ఆ కసరత్తును త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.

అలాగే, జనసేన అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. వామపక్షాలతో పొత్తుపైనా మూడు దఫాలుగా చర్చలు జరిపారు. మేనిఫెస్టోను కూడా రూపొందించే పనిలో ఉన్నారు. ఈనెల14న రాజమండ్రిలో జరిగే జనసేన ఆవిర్భావ సభలో మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి నెలరోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికావాల్సి ఉండటంతో పార్టీలన్నీ ఉన్న తక్కువ సమయంలోనే గెలుపు కోసం పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నాయి. త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోయేందుకు పావులు కదుపుతున్నాయి. మరి ఈ నెలరోజుల సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందో ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories