పాలకొండలో పట్టుబిగించిన పార్టీ ఏది...పెరిగిన ఓటింగ్ శాతంపై...
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుంది గట్టి పట్టున్న పసుపుదళం మరోసారి జెండా ఎగరవేస్తుందా లేక ఫ్యాన్ గాలి తుపానుగా మారి...
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుంది గట్టి పట్టున్న పసుపుదళం మరోసారి జెండా ఎగరవేస్తుందా లేక ఫ్యాన్ గాలి తుపానుగా మారి బీభత్సం సృష్టిస్తుందా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి విజయం కట్టబెట్టిన పాలకొండ నియోజకవర్గంలో, ఈసారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?
శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతం, ఆది నుంచి అభివృద్ధికి ఆమడ దూరం. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రతీసారి ఏజెన్సీ అభివృద్దికి హామీలవర్షం కురిపిస్తున్న ఒరిగింది శూన్యం. పాలకొండలో హోరాహోరి కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి నిమ్మక కృష్ణప్ప, వైసీపీ అభ్యర్థిగా కళావతి రంగంలోకి దిగారు.
పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే, నియోజకవర్గ పరిధిలో పాలకొండ, వీరఘట్టాం, సీతంపేట, భామిని మండలాలున్నాయి. 1,84,414 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1,35,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 66,582 మంది పురుషులు ఓటేయగా, 69,401 మంది మహిళలు పోలింగ్ నాడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో సుమారు 14,936 మంది ఓటర్లు పెరగడంతో పాటు ఓటింగ్ శాతం కూడా అదే రీతిలో పెరిగింది. పెరిగిన ఓటింగ్ను ఇటు టీడీపీ, అటు వైసీపీలు తమకు అనుకూలంగా భావిస్తున్నాయి.
జనాభా పరంగా కాపు, ఎస్టీ సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఎస్సీ,వైశ్య,కూరాకుల సామాజిక వర్గాలు ఉన్నాయి. 1989లో ఏర్పడిన పాలకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం, కాంగ్రెస్ ఒకదాని తరువాత ఒకటి వరుసగా గెలుపొందుతూ వస్తున్నాయి. 2009లో కాంగ్రెస్ నుంచి నిమ్మక సుగ్రీవులు గెలుపొందగా, 2014లో వైసీపీ నుండి విశ్వసరాయ కళావతి గెలుపొందారు. కాగా తాను నియోజకవర్గంలో గెలిచినా, పార్టీ అధికారంలో లేకపోవడం వల్లనే నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, తాను అభివృద్ధికి సంకల్పించినా అధికార పార్టీ నాయకులు పెట్టిన అడ్డంకుల వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదనే వాదనను ఎమ్మెల్యే కళావతి ఎన్నికల అస్త్రంగా ప్రయోగించారు.
అయితే టీడీపీ నాయకుల వెర్షన్ మాత్రం మరో విధంగా ఉంది. నియోజకవర్గ సమస్యలతో పాటు ముఖ్యమైన గిరిజనుల అభివృద్దికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కృషి, తమను ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపిస్తుంద్న దీమాలో ఉన్నారు. స్థానికంగా తాము అధికారంలో లేకపోయినా, తమ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి నిధులు తీసుకురాగలిగామని అంటున్నారు. అధికార పార్టీ ఇన్ చార్జిగా ఎమ్మెల్యే కంటే ముందుగానే స్పందించి, కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం ద్వారా నియోజకవర్గం అభివృద్ది చేశామని టీడీపీ అభ్యర్ధి నిమ్మక జయకృష్ణ చెబుతున్నారు.
అయితే రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులకి సంబంధించి ఎన్నికల సమయంలో హోరా హోరీ ప్రచారం అయితే జరిగినప్పటికీ, ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీల బలం, అభ్యర్ధుల వ్యక్తిగత చరిష్మాతో పాటు సామాజిక సమీకరణాలు ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire