వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కేఏ పాల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కేఏ పాల్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీని ప్రజాశాంతి పార్టీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ మాదిరే కేఏ పాల్ పార్టీ గుర్తు హెలికాప్టర్...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీని ప్రజాశాంతి పార్టీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ మాదిరే కేఏ పాల్ పార్టీ గుర్తు హెలికాప్టర్ ఉండడం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలో 35 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు వైసీపీ అభ్యర్థులను పోలి ఉన్నాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు.

కేఏ పాల్ తన ఎన్నికల గుర్తుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా ఒకే అభ్యర్ధి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ గుర్తు తెచ్చుకున్నారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను వెతికి మరి పోటీకి దించారు.

పర్చూరులో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయగా, అక్కడ అదే పేరు గల వ్యక్తి ప్రజా శాంతి పార్టీ తరఫున నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది చోట్ల వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారితోనే పాల్ నామినేషన్ వేయించారు. ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఉండాల రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి బరిలో ఉండగా, ప్రజా శాంతి పార్టీ నుంచి పగిడి వెంకటరామిరెడ్డిని నిలబెట్టారు.

ఉరవకొండలో వైసీపీ తరఫున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి పాల్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం విశేషం. కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉషా శ్రీచరణ్, ప్రజా శాంతి నుంచి ఉషారాణి నామినేషన్ వేశారు. రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. పెనుగొండలో ఎం శంకర్ నారాయణ వైసీపీ, ఎస్ శంకర్ నారాయణ ప్రజా శాంతి పార్టీ, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి నామినేషన్ వేశారు.

దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసి తమ అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొట్టడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు కింద లేదా పైన హెలికాప్టర్ ఉండేలా ప్రత్యర్ధులు చూస్తున్నారని, దీంతో నిరక్షరాస్యులైన ఓటర్లు పొరబడే ప్రమాదం ఉందని అంటున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories