2019ని ప్రాంతీయ పార్టీలు శాసించబోతున్నాయా?

2019ని ప్రాంతీయ పార్టీలు శాసించబోతున్నాయా?
x
Highlights

కేసీఆర్‌ కాన్ఫిడెన్స్ ఏంటంటే, భవిష్యత్తు మొత్తం ప్రాంతీయ పార్టీలదేనని బీజేపీ, కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్న నేపథ్యంలతో, రీజినల్‌ పార్టీలదే ఫ్యూచర్‌...

కేసీఆర్‌ కాన్ఫిడెన్స్ ఏంటంటే, భవిష్యత్తు మొత్తం ప్రాంతీయ పార్టీలదేనని బీజేపీ, కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్న నేపథ్యంలతో, రీజినల్‌ పార్టీలదే ఫ్యూచర్‌ అని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో, కాంగ్రెస్, బీజేపీల కన్నా, ఎక్కువ స్థానాలు సాధించేది ప్రాంతీయ పార్టీలేనని, కేసీఆర్‌ గట్టి నమ్మకం. కేసీఆర్ కాన్ఫిడెన్స్‌కు లెక్కేంటి బీజేపీ, కాంగ్రెస్‌ల బలం ఎలా తగ్గుతోంది ముఖ‌్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయ అంకగణితం చెబుతున్నదేంటి? ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రాంతీయ అధినేతల మధ్య సఖ్యత సాధ్యమేనా?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాటి ఫలితాలు, జాతీయ రాజకీయాల అంకగణితాన్నే మార్చేశాయి. ముఖ్యంగా బీజేపీ బలాన్ని చాలా వరకు తగ్గించాయి. 2014లో అఖండ మెజారిటీ సాధించినా, 2019లో మెజారిటీ మార్క్‌ చేరుకోవడం అంత ఈజీ కాదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు కూడా, మెజారిటీ సీట్లు రావన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే, ప్రాంతీయ పార్టీలు రోజురోజుకు బలం పుంజుకుంటున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల ఫలితాలను బట్టి చూస్తే బిజెపికి గతంలో లాగా ఈ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 65 సీట్లలో, 62 సీట్లు వచ్చే అవకాశాలు లేవు. కనీసం సగం సీట్లు కాషాయ పార్టీ కోల్పోక తప్పదని అంచనా.

హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీకి ముఖ్యమైన మరో రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2014, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం అంతిమంగా బీజేపీకి లాభమైందని ఎస్పీ, బీఎస్పీలు గ్రహించాయి. ఇప్పుడు యూపీలో బిఎస్‌పి, ఎస్‌పి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బిజెపికి 20 సీట్లు కూడా రావని ఆ పార్టీ నేతలే అంటున్నారు. బీజేపీకి నిజంగా యూపీ బీపీ పెంచుతోంది. గుజరాత్‌లో బిజెపి గతంలో 26కు 26 సీట్లు గెలుచుకుంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ గణనీయంగా పుంజుకోగలిగింది. ఈసారి అక్కడ కూడా సగానికి పడిపోయే ఛాన్స్‌లే ఎక్కువ. అలాగే బీహార్‌లో గతంలో గెలుచుకున్నట్లు 22, జార్ఖండ్‌లో 12 సీట్లు రావడం అంత ఈజీ కాదు. ఢిల్లీలో 7కు 7 సీట్లు మరోసారి రావడం కూడా బీజేపీకి కష్టమే. స్థూలంగా చూస్తే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్, బిహార్, గుజరాత్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనే, బిజెపి గత ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకోగా, ఈసారి 100 స్థానాలు కూడా గెలుచుకోవడం కష్టంగా కనపడుతోంది.

భారతీయ జనతా పార్టీ, కొత్తగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రాలు ఒడిషా, పశ్చిమ బెంగాల్, అలాగే ఈశాన్యం. వీటిలో దాదాపు 20 స్థానాల్లో పుంజుకుంటున్నట్టు అంచనా వేసుకుంటోంది. ఈశాన్యంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన చూస్తే, ఈ మూడు ప్రాంతాల్లో బిజెపి దాదాపు 20 సీట్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీ రాష్ట్రాల్లో కోల్పోయే సీట్లతో కొన్నింటిని ఇవి భర్తీ చేయొచ్చు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో బిజెపి సంఖ్యాబలం 150-160కు మధ్యకు చేరుకునే పరిస్థితే అధికంగా కనిపిస్తోందని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్, బిజెపిలకు కలిపి 2009 ఎన్నికల్లో 322 స్థానాలు రాగా, 2014 ఎన్నికల్లో 326 స్థానాలు వచ్చాయి. అంటే ఈ రెండు ఎన్నికల్లోనూ దాదాపు 220 స్థానాలు బిజెపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు సాధించాయన్నమాట. వచ్చే ఎన్నికల్లో మోడీ పార్టీ సంఖ్యాబలం 150-160కి పడిపోతే, రాహుల్‌ పార్టీకి కూడా దాదాపు అన్నే స్థానాలు వస్తాయని పొలిటికల్‌ అరిథమెటిక్‌ చెబుతోంది. అదే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల దీమా. 2019 ఎన్నికల్లో, కాంగ్రెస్, బీజేపీల కంటే, తమకే ఎక్కువ స్థానాలొస్తాయని రీజినల్‌ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడాలంటున్న కేసీఆర్‌ ఆత్మవిశ్వాసానికి కూడా, ఈ రాజకీయ అంకగణితమే ఊతమిస్తోంది.

ఈ లెక్కలు చూస్తుంటే, 2019లో ప్రాంతీయ పార్టీలదే హవా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలే, వచ్చే ఎన్నికల్లో దేశ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయని, అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు తమ మధ్య ఐక్యతను సాధించగ‍‍లిగితే కాంగ్రెస్ లేదా బిజెపి మద్దతుతో అవి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులూ ఏర్పడవచ్చు. కేసీఆర్‌ చెబుతున్న బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడొచ్చు. కానీ ప్రాంతీయ పార్టీల మధ్య సఖ్యత సాధ్యమా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే, ఎవరి బలాన్ని వాళ్లు ఎక్కువగా ఊహించుకుంటారు. ఎక్కువమంది ప్రాంతీయ పార్టీల అధినేతల ఆశలన్నీ ప్రధాని పదవిపైనే. అదే ప్రాంతీయ పార్టీల ఐక్యతకు తూట్లు పొడిచే ప్రమాద సంకేతం.

Show Full Article
Print Article
Next Story
More Stories