ఎస్పీ-బీఎస్పీ బంధానికి బీటలు...బీజేపీని దెబ్బ కొట్టే వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది?

ఎస్పీ-బీఎస్పీ బంధానికి బీటలు...బీజేపీని దెబ్బ కొట్టే వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది?
x
Highlights

ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఏదేదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిపోయింది. ఎన్నికల్లో ఓటమి భారం ప్రాంతీయ పార్టీల కూటమిలో కుంపటి రాజేసింది. తెలంగాణ...

ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఏదేదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిపోయింది. ఎన్నికల్లో ఓటమి భారం ప్రాంతీయ పార్టీల కూటమిలో కుంపటి రాజేసింది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓ ఆట ఆడిద్దామనుకొని బొక్కాబోర్లాపడ్డ మహాకూటమిలాగే దేశవ్యాప్తంగా కూటమి పార్టీలు విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఎస్పీ నుంచి బీఎస్పీ బయటకు రావడం వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటమేనని మాయావతి తేల్చిచెప్పడంతో ప్రాంతీయ పార్టీల కూటముల అస్పష్ట వైఖరి తేలిపోయినట్టయింది.

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదమే.. కొద్దిరోజుల క్రితం యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకొని అధికార బీజేపీని చిత్తుగా ఓడించారు. దీంతో మాయ రెచ్చిపోయారు. తమ మహాకూటమిని ఎదుర్కోవడం బీజేపీ వల్ల కాదని బీరాలు పలికారు. అఖిలేష్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ మహాకూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మాయా మరోసారి కూటమి నుంచి బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

భవిష్యత్‌లో ఇక ఎస్పీతో పొత్తు ఉండదని మాయావతి తాజాగా కుండబద్దలు కొట్టేశారు. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీ శ్రేణులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యూపీ ప్రజలు జాతీయ కోణంలో కాకుండా రాష్ట్రీయ కోణంలో ఆలోచిస్తారు. ఎస్పీ-బీఎస్పీ కలిసి ఉంటే వారికే ఓటేస్తారు. అందుకే ఇప్పుడు మాయవతి తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా బీజేపీ శిబిరాన్ని సంతోషపెట్టగా ఎస్పీ అఖిలేష్ యాదవ్‌ను షాక్‌కు గురిచేసిందనే చెప్పాలి.

మొదటి నుంచీ మాయావతిలో దూకుడు ఎక్కువ. స్థిరంగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండరని భావన. ఓడినా గెలిచినా కట్టుబడి ఉండే రకం కాదు. అందుకే అలా ఓడగానే ఇలా ప్రత్యర్థులకు అస్త్రాలను అందిస్తుంటారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ పార్టీకి పట్టం కట్టడంతో ఎస్పీతో దోస్తీకి స్వస్తి పలికారు. నిజానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీలు అయిన ఎస్పీ- బీఎస్పీకి ఓటేస్తే అది వేస్ట్ అన్న భావన ఆ రాష్ట్ర ప్రజల్లో ఉంటుంది. అందుకే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జాతీయ కోణంలో ఆలోచించి బీజేపీ-కాంగ్రెస్‌ను గెలిపించారు. అలా అని కూటమి విచ్చిన్నం చేసుకుంటే మాత్రం మునిగేది మాయావతియే. రాష్ట్ర అసెంబ్లీ విషయంలో ఓటర్లు స్థానిక పార్టీల వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి తొందరపడి మాయావతి ముందేకూసి ఎస్పీతో దోస్తీ కట్ చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories