జాతీయ పార్టీలకిచ్చే సందేశం... .సంకీర్ణంలో కొత్త శకం

జాతీయ పార్టీలకిచ్చే సందేశం... .సంకీర్ణంలో కొత్త శకం
x
Highlights

బీజేపీని ఓడించడానికి దక్షిణాదిన సరికొత్త కూటమి రెడీ అవుతోందా?2019 టార్గెట్ గా అడుగులు వేస్తోందా? ముందు ముందు ప్రాంతీయ పార్టీల ధాటికి జాతీయ పార్టీలు...

బీజేపీని ఓడించడానికి దక్షిణాదిన సరికొత్త కూటమి రెడీ అవుతోందా?2019 టార్గెట్ గా అడుగులు వేస్తోందా? ముందు ముందు ప్రాంతీయ పార్టీల ధాటికి
జాతీయ పార్టీలు సాగిల పడాల్సిందేనా? సీట్లు తక్కువొచ్చినా, కీలక శాఖలు, పదవులు చేజిక్కించుకుని జాతీయ పార్టీలను అల్లంత దూరంలో నిలుపుతున్న
ప్రాంతీయ పార్టీలు ఇస్తున్న సందేశం ఏంటి? సంకీర్ణంలో కొత్త శకం ఆరంభమవుతోందా?

కర్ణాటక రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరిగి... ఇప్పుడో రూట్లో పడ్డాయి. ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న
కుమారస్వామి దాదాపు లక్ష మంది ఈ వేడుకను చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. దక్షిణాదిన బీజేపీని కాదని ఏర్పాటవుతున్న సంకీర్ణ సర్కార్ కాబట్టి
బీజేపీయేతర పార్టీలను ఈ వేడుకకు ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సీఎం
నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తమిళనాడు నుంచి డిఎంకె నేత స్టాలిన్, కేరళ సిఎం పినరయ్ విజయన్, బిఎస్పీ అధినేత్రి మాయావతి,
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ జేడిఎస్ సంకీర్ణ భాగస్వామి లాలూ తనయుడు తేజస్వి యాదవ్, మక్కల్ నీది
మయ్యుం పార్టీ నేత కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు. వీరికి తోడు వామపక్ష నేత సీతారాం ఏచూరి కాంగ్రెస్ నేతలతో కలసి వేదిక పంచుకున్నారు.

37 సీట్లున్న జేడిఎస్ అభ్యర్ధి కుమార స్వామి సిఎంగా ప్రమాణం చేస్తుంటే.. 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్ డిప్యూటీ సిఎంగా సర్దుకుపోయింది. రెండు డిప్యూటీ
సిఎం పదవులు కేటాయించి కాంగ్రెస్‌కు ఒక డిప్యూటీ సిఎం పదవి ఇచ్చి మరో డిప్యూటీ సిఎం పదవి తమకు నచ్చిన వారికివ్వాలన్నది జేడీఎస్‌ ఆలోచన. కీలక
శాఖలపై కూడా జేడిఎస్‌దే పెత్తనమని అర్ధమైపోతోంది. జేడిఎస్ తక్కువ సీట్లు వచ్చినా కీలక శాఖలకోసం పట్టుబట్టడం.. కనీసం సిఎం పదవిని షేరింగ్ పద్ధతిలో
పంచుకోడానికి కూడా కాంగ్రెస్ ఒప్పించలేకపోవడం చూస్తుంటే దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల బలం ఎలా పెరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు. దక్షిణాదిన ప్రబల
శక్తిగా చిన్న పార్టీల ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలయితే కనిపిస్తున్నాయి.. దాదాపు మెజారిటీ ప్రాంతీయ పార్టీలు ఈ వేడుకకు హాజరై తమ ఐక్యతను
చాటుకుంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న కేసిఆర్ మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.. బిజెపి, కాంగ్రెస్‌లకు
సమదూరంలో ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని తాను ప్రకటించడంతో ప్రమాణ స్వీకార ఉత్సవంలో కాంగ్రెస్‌తో కలసి ఈ వేదికను పంచుకోవడం ఆయనకు ఇష్టం
లేదు..అందుకే మంగళవారం మధ్యాహ్నమే బెంగళూరు వెళ్లి దేవెగౌడను కలసి అభినందనలు తెలిపి సాయంత్రానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.

మరోవైపు బిజేపియేతర ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని రాష్ట్రాల సిఎంలు తరలి రావడం చూస్తుంటే.. బిజెపి ప్రత్యమ్నాయ కూటమి బలపడుతోందనుకోవాలా? బిజెపిపై
ఇంత స్వల్ప కాలంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకత ఎందుకు పెరిగింది? కుమార స్వామి ప్రమాణ స్వీకార వేదిక బిజెపి ప్రత్యామ్నాయ కూటమి వేదికగా
మారనుందా?78 సీట్లుండీ.. నిమిత్త మాత్రంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఎందుకిలా సాగిలపడుతోంది? దక్షిణాదిన సంకీర్ణంలో కొత్త ఫార్ములా తెరపైకి
వస్తోందా? ఇక ప్రాంతీయ పార్టీలదే పెత్తనం కానుందా? దీనికి సమాధానం చెప్పేది కాలం ఒక్కటే.

Show Full Article
Print Article
Next Story
More Stories